Homeఅంతర్జాతీయంవినియోగదారుల రుణాలపై ఆర్బీఐ కీలక ప్రకటన

వినియోగదారుల రుణాలపై ఆర్బీఐ కీలక ప్రకటన

 


కరోనా నేపథ్యంలో రుణగ్రహీతలకు ఆర్‌‌బీఐ ఎంతో వెసులుబాటు కల్పించింది. లోన్లపై ఆరు నెలల పాటు మారటోరియం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రుణగ్రహీతలు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ.. ఆ మారటోరియం విషయంలో వడ్డీల మీద చక్రవడ్డీలు వేయడంతో పలువురు రుణగ్రహీతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇంకా ఏమైనా వెసులుబాటు ఇచ్చేందుకు ప్రయత్నించాలంటూ సుప్రీం కోర్టు ఆర్‌‌బీఐకి సూచించింది.

Also Read: వామ్మో… ఆ గురుకుల కేంద్రంలో 50 మంది విద్యార్థులకు కరోనా..?

కొవిడ్‌-19  రుణాలపై ఇంకా వెసులుబాటు ఇవ్వలేమని.. మారటోరియాన్ని ఆరు నెలలకు మించి పొడిగిస్తే.. అది ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని.. పైగా రుణ గ్రహీతలపైనా ఒక్కసారిగా భారం పడుతుందని ఆర్‌‌బీఐ స్పష్టం చేసింది. ‘ఇప్పటివరకు బ్యాంకు రుణాలపై గరీబ్‌ కల్యాణ్‌, ఆత్మనిర్భర్‌ పేరుతో ఉపశమనం కల్పించాం. మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీ (చక్ర వడ్డీ) మాఫీ మినహా.. ఇంకా వెసులుబాటు ఇవ్వలేం. మారటోరియాన్ని మరింత కాలం పొడిగించడం కుదరదు’ అని చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించాయి.

కరోనా వల్ల చాలా మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. వ్యాపారుల బిజినెస్‌లు మూతపడ్డాయి. ఎవరికీ ఎలాంటి ఆదాయమూ లేకుండా పోయింది. దీంతో మార్చి 1 – మే 31 మధ్య కాలానికి రుణాలు, వడ్డీ, కిస్తీల చెల్లింపుల విషయంలో మారటోరియం ప్రకటిస్తూ ఆర్‌బీఐ మార్చి 27న సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ పొడిగింపు కారణంగా మారటోరియం గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ నిర్ణయం వల్ల భారమేమి తగ్గదని, ఆ తర్వాతైనా చక్ర వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని విచారిస్తున్న సుప్రీంకోర్టుకు ఈ నెల 2న కేంద్రం ఓ అఫిడవిట్‌ సమర్పించింది. రూ.2 కోట్లలోపు రుణాల విషయంలో చక్ర వడ్డీని మాఫీ చేస్తున్నట్లు అందులో పేర్కొంది.

దీనిపై ఈ నెల 5న విచారణ జరిపిన కోర్టు ఆ అఫిడవిట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవీ కామత్‌ కమిటీ ప్రతిపాదనల మేరకు నివేదికలు ఇవ్వాలని కేంద్రం, ఆర్‌బీఐని సూచించింది. ఆ ఆదేశాల మేరకు కేంద్రం, ఆర్‌బీఐ సంయుక్తంగా ఓ అఫిడవిట్‌ దాఖలు చేశాయి. ఆర్థిక విధానాలు ప్రభుత్వాల పరిధిలో ఉంటాయని.. ఇలాంటి వ్యాజ్యాలను సమర్థించకూడదని కోర్టును కోరాయి. మరిన్ని ఉపశమనాలను ప్రకటిస్తే ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగం ప్రమాదంలో పడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. రంగాల వారీగా ఉపశమనం కుదరదన్న విషయాన్ని కామత్‌ కమిటీ కూడా చెబుతోందని వివరించింది. కరోనా నేపథ్యంలో ఎనిమిది కేటగిరీల్లో ఎంఎస్‌ఎంఈ, విద్యా రుణాలు, గృహ రుణాలు, వినియోగదారుల దీర్ఘకాలిక రుణాలు, క్రెడిట్‌ కార్డు కిస్తీలు, వాహన, వ్యక్తిగత రుణాలు, వినిమయ రుణాలపై మారటోరియం విధించినట్లు గుర్తుచేసింది.

Also Read: కరోనా సోకిన ఎమ్మెల్యేపై కేసు నమోదు.. ఎందుకంటే..?

కేంద్రం కూడా ఉపశమనం కల్పిస్తూ పలు ప్యాకేజీలు ప్రకటించింది. గరీబ్‌ కల్యాణ్‌లో భాగంగా రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని, ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలో రూ.20 లక్షల కోట్లను విడుదల చేసింది. ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారమేనని, మరిన్ని ఉపశమనాలు ఇస్తే.. ఆ భారం ఇంకా పెరుగుతుందని వివరించింది. చక్ర వడ్డీ మాఫీ కూడా అదనపు భారమేనని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా.. అన్ని కోణాల్లో పరిశీలనలు జరిపే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది. కాగా సెప్టెంబరు 4 నాటి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల (తదుపరి ఆదేశాలు వెలువడే దాకా.. రుణాలు చెల్లించని వారిని ఎగవేతదారుల కింద జమకట్టొద్దు)ను రద్దు చేయాలని అభ్యర్థించింది. కేంద్రం, ఆర్‌బీఐ సమర్పించిన తాజా అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు ఈనెల 13న విచారణ జరపనుంది. ఈ విచారణలో పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular