Pakistan Debt Crisis 2026: పాకిస్తాన్ అప్పుల సంక్షోభంలో కొట్టుబిట్టాడుతోంది. చైనా నుంచి సౌదీ అరేబియా వరకు, యూఏఈ నుంచి తుర్కియే వరకు అన్ని దేశాల నుంచి అప్పులు చేసింది. ప్రపంచంలో ఏ దేశం అప్పు ఇస్తే ఆ దేశం నుంచి తీసుకోవడం పాకిస్తాన్కు అలవాటుగా మారింది. రుణం తీసుకోవడం వరకు ఓకే.. కానీ తిరిగి చెల్లించేప్పుడు రీషెడ్యూల్ చేయాలని, వడ్డీ మాఫీ చేయాలని, వాయిదాల్లో చెల్లిస్తామని బతిమిలాడడం, ఆలస్యంగా చెల్లిస్తానని వేడుకోవడం పాకిస్తాన్కు అలవాటైంది. కానీ ఇప్పుడు ఒక దేశం తమ రుణం చెల్లించాలని అడగడంతో నెల రోజుల్లో చెల్లించేందుకు సిద్ధమైంది.
పాకిస్తాన్ అప్పులు ఇలా..
పాకిస్తాన్ చైనా (30 బిలియన్), సౌదీ అరేబియా (20 బిలియన్), యూఏఈ (10 బిలియన్), ఐఎంఎఫ్ (6 బిలియన్) డాలర్ల చొప్పున అప్పులు చేసింది. మొత్తం విదేశీ రుణం 130 బిలియన్ డాలర్లు దాటింది. రుణం తీసుకోవడం సహజం, కానీ తిరిగి చెల్లించడం పాకిస్తాన్కు తలకు మించిన భారంగా మారుతోంది. ఈ క్రమంలో యూఏఈ మాత్రం కఠినంగా వ్యవహరించి, నెల రోజుల్లో రుణం చెల్లించాలని ఒత్తిడి చేస్తోంది.
యూఏఈ ఒత్తిడికి కారణం ఇదే..
యూఏఈ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం పాకిస్తాన్ డబుల్ గేమ్. ఇటు ఇరాన్ తో స్నేహం, అటు సౌదీ–యూఏఈ కూటమికి దగ్గరగా ఉండటం. పాకిస్తాన్ ప్రధాని, సైనికాధికారులు, సంపన్నులు దుబాయిలో 17,000 మంది 23,000 ఆస్తులు (విల్లాలు, అపార్ట్మెంట్లు, ఫ్యాక్టరీలు) కొనుగోలు చేశారు. అప్పు తీర్చకపోతే ఈ ఆస్తులు స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం తమ ఎలైట్ వర్గం ఆస్తులను కాపాడుకోవడానికి దేశాన్ని మరింత దారిద్య్రంలోకి నెట్టే నిర్ణయం తీసుకుంది.
ప్రజలపై పన్నుల భారం..
అపుపలు తీర్చేందుకు ప్రజలపై పాకిస్తాన్ పాలకులు పన్నుల భారం వేస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం ఆవుపేడ నేలపై పడితే రూ.30 పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన పన్ను. దీనికి తోడు పెట్రోల్ ధరలు 40 శాతం పెంచింది. గోధుమ పిండి కిలో రూ.80, బియ్యం రూ.120, విద్యుత్ బిల్లులు 50 శాతం పెరిగాయి. రూపాయి విలువ 35% పడిపోయింది. ఆర్థిక సంక్షోభంతో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. 40 శాతం మంది పాకిస్తానీలు పేదరికం రేఖకు దిగువన ఉన్నారు.
అంతర్జాతీయ ఒత్తిళ్లు..
కొత్తగా 3 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి పన్నులు పెంచాలని ఐఎంఎఫ్ ఒత్తిడి చేస్తోంది. సబ్సిడీలు తగ్గించాలని షరతులు విధించింది. విద్యుత్ ప్రాజెక్టుల బకాయిలు 5 బిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇరాన్తో పాకిస్తాన్ సంబంధాలపై సౌదీ అరేబియా అసంతృప్తి వ్యక్తం చేసి, రుణ రీషెడ్యూలింగ్ నిరాకరించింది. ఈ ఒత్తిళ్ల మధ్య పాకిస్తాన్ మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పాకిస్తాన్ తక్షణం 2.45 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. దీనికి మరిన్ని అప్పులు చేస్తే, వడ్డీ భారం పెరిగి 2027 నాటికి దివాలా తీసే ప్రమాదం ఉంది. ప్రజా ఆందోళనలు, సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం ఉంది. సంస్కరణలు (పన్నుల విస్తరణ, ఎగుమతుల పెంపు) చేయకపోతే, పాకిస్తాన్ శ్రీలంక లాగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది.