Middle East War Impact: మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం తగ్గడం లేదు. ఇరాన్ వెనకడుగు వేయడం లేదు. అమెరికా దూసుకుపోతోంది. ఇజ్రాయిల్ దాడులను తీవ్రతరం చేస్తోంది. మొత్తంగా చూస్తే యుద్ధం వల్ల మధ్య ప్రాచ్యం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటుంది. దీనివల్ల కేవలం ఆ దేశాలు మాత్రమే కాదు.. ప్రపంచం కూడా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నది.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
కీలకమైన జల సంధులను ఇప్పటికే ఇరాన్ మూసివేసింది. దీంతో క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. భారత్ లాంటి దేశాల్లో కేవలం 50 రోజులకు మాత్రమే సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. ఇవి నిండుకోక ముందే త్వరగా క్రుడ్ ఆయిల్ ను దిగుమతి వేసుకోవాల్సిన పరిస్థితి ఇండియా మీద ఉంది. అందువల్లే రష్యాతో ఒప్పందం కుదరచుకొని.. క్రుడ్ ఆయిల్ మొత్తాన్ని దిగుమతి చేసుకుంటుంది.
భారత్ కు క్రూడ్ ఆయిల్ పరంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ.. యుద్ధం వల్ల కందిపప్పు.. పెసరపప్పు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆఫ్రికా, మయన్మార్, కెనడా దేశాల నుంచి భారత్ ప్రతి ఏడాది ఐదు నుంచి 6 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశ అవసరాలకు సరిపడా జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, కుంకుమపువ్వు, ఆఫ్రికాట్ వంటివి దిగుమతి అవుతుంటాయి. అయితే ఇరాన్ హార్ముజ్ జల సంధి ని మూయడంతో సరుకు రవాణా సాధ్యం కావడం లేదు. దీంతో జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, కుంకుమపువ్వు, ఆఫ్రికాట్ ధరలకు రెక్కలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి తోడు ఫెర్టిలైజర్ సరఫరా కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇవే గనక జరిగితే ధరలు విపరీతంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే మన దేశంలో ధరల స్థాయి పెరిగిపోతోంది. వంట నూనెల ధరలు భగభగమంటున్నాయి. వీటికి తోడు ఇప్పుడు పెసరపప్పు, కందిపప్పు వంటివాటి ధరలు పెరిగితే సామాన్యులు తట్టుకోలేరు. ఎండుఫలాల ధరలు కూడా విపరీతంగా పెరిగితే అవి సామాన్యులకు ఇబ్బందికరంగా మారుతాయి. మనదేశంలో ఎండుఫలాలు అంతగా ఉత్పత్తి కావు. దేశీయ అవసరాలకు ఇతర దేశాల నుంచి ఎండుఫలాలను చాలా సంవత్సరాలుగా మనం దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి వీటిని మనం కొనుగోలు చేస్తున్నాం. వీటి ధరలు పెరిగితే విదేశీ మారక ద్రవ్య నిలువల మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.