India vs China: నేటి యుగంలో ఏ దేశం యొక్క శక్తి, స్థిరత్వం, అభివృద్ధి అన్నీ శాస్త్రసాంకేతిక పురోగతిపైనే ఆధారపడి ఉంటాయి. ఆర్థిక వృద్ధి నుంచి జాతీయ భద్రత వరకు, పరిశ్రమల అభివృద్ధి నుంచి ఆరోగ్య సేవలు, అంతరిక్ష అన్వేషణ, డిజిటల్ మౌలిక సదుపాయాల వరకు ప్రతి రంగంలోనూ వైజ్ఞానిక సామర్థ్యమే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియాలో రెండు ప్రధాన శక్తులైన చైనా, భారత్ అనుసరిస్తున్న వ్యూహాలు, సాధించిన ఫలితాలు పోల్చి చూడడం అవసరం ఉంది.
చైనా దీర్ఘకాలిక లక్ష్యాలు..
చైనా శాస్త్రసాంకేతికరంగంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ‘మేడ్ ఇన్ చైనా–2025’ కింద ఆటోమొబైల్స్, విమానయానం, యంత్రాలు, రోబోటిక్స్, అధునాతన రైల్వే–సముద్ర పరికరాలు, వైద్య ఉపకరణాలు, సమాచార సాంకేతికత వంటి హైటెక్ రంగాలను ప్రాధాన్యం ఇచ్చింది. సంస్థల పోటీతత్వాన్ని పెంచి ప్రపంచ మార్కెట్లలో వాటి విస్తరణను వేగవంతం చేయడమే లక్ష్యం. ‘చైనా స్టాండర్డ్స్ 2035’ ద్వారా 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధ వంటి రంగాల్లో ప్రపంచ ప్రమాణాలను తానే నిర్ణయించాలని ప్రయత్నిస్తోంది. సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష శాస్త్రం, రక్షణ సాంకేతికతలపై భారీ పెట్టుబడులు పెట్టి స్వయంసమృద్ధి సాధించాలని బీజింగ్ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు సమన్వయంతో పనిచేయడం దీనికి బలం చేకూర్చింది. జీడీపీలో రెండు శాతానికి పైగా ఆర్ అండ్ డీకి కేటాయించడం ద్వారా శాస్త్రీయ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించింది.
భారత్ ప్రజాస్వామిక వ్యవస్థ, సవాళ్లు
భారత్లో శాస్త్రసాంకేతిక అభివృద్ధి ప్రజాస్వామిక, వికేంద్రీకృత పద్ధతిలో సాగుతోంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, శాస్త్రసాంకేతిక ఆవిష్కరణ విధానం వంటి కార్యక్రమాలు దేశీయ సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి సారిస్తున్నాయి. అయితే ఆర్ అండ్ డీపై ఖర్చు జీడీపీలో 0.8 శాతం మాత్రమే ఉండటం ప్రధాన లోపం. దీని మధ్యనే ప్రైవేట్ రంగం, స్టార్టప్ వ్యవస్థ, యువత ఆవిష్కరణలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. మానవ వనరుల పరంగా రెండు దేశాలూ బలమైనవే. అయితే విధానాల్లో తేడా స్పష్టం. చైనా స్టెమ్ విద్యపై దృష్టి సారించి నైపుణ్యవంతులైన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలను పెద్ద సంఖ్యలో తయారు చేస్తూ విదేశాల నుంచి నిపుణులను కూడా ఆకర్షిస్తోంది. భారత్లో ఐఐటీలు వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఉన్నా, మేధావులు వలస వెళ్లడం సమస్యగా మారుతోంది.
బలాలు, బలహీనతలు..
– చైనా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించి క్లిష్టమైన ప్రయోగాలను విజయవంతం చేసింది. భారత్ తక్కువ వ్యయంతో చంద్రయాన్, మంగళయాన్ వంటి మిషన్లను నిర్వహించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.
– ఇంధన రంగంలో చైనా పెద్ద ఎత్తున అణు విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తుండగా, భారత్ మూడు దశల అణు ప్రణాళిక ద్వారా థోరియం ఆధారిత సాంకేతికతపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
– 5జీ, కృత్రిమ మేధ, ఫేషియల్ రికగ్నిషన్ వంటి రంగాల్లో చైనా వేగంగా ముందున్నది. భారత్ ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా తక్కువ ఖర్చుతో విస్తృత ప్రజలను కలిపే నమూనాను ప్రపంచానికి అందించింది. హార్డ్వేర్, సెమీకండక్టర్ తయారీలో భారత్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.
– పేటెంట్ దరఖాస్తుల్లో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా, భారత్లో ఆవిష్కరణల నాణ్యత బాగున్నా సంఖ్యాపరంగా వెనుకబడి ఉంది. ఇది పెట్టుబడులు, వ్యవస్థాపర మద్దతులోని తేడాను సూచిస్తుంది.
ఆర్ అండ్ డీపై తగ్గుతున్న ప్రభుత్వ వాటా
పరిశోధనలపై పెట్టుబడులు పెరిగితే పారిశ్రామిక ఉత్పాదకత కూడా పెరుగుతుంది. అయితే భారత్లో ఆర్ అండ్ డీ ఖర్చు జీడీపీలో ఒక శాతం కంటే తక్కువగానే ఉంది. అందులోనూ ప్రభుత్వ వాటా గత కొన్నేళ్లుగా తగ్గుతోంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం నివేదిక ప్రకారం 2021–22లో ప్రభుత్వ రంగం 54.5 శాతం, ప్రైవేట్ పరిశ్రమలు 39.7 శాతం, ఇతరులు 5.8 శాతం ఉన్నాయి. 2022–23లో ప్రభుత్వ రంగం 52.0 శాతం, ప్రైవేట్ పరిశ్రమలు 41.6 శాతం, ఇతరులు 6.4 శాతం ఉన్నాయి.
2023–24లో ప్రభుత్వ రంగం 48.2 శాతం, ప్రైవేట్ పరిశ్రమలు 45.2 శాతం, ఇతరులు 6.6 శాతం ఉన్నాయి.
మొత్తంగా వేగం, పెట్టుబడులు, అమలు సామర్థ్యంలో చైనా ముందుంది. మేధస్సు, సృజనాత్మకత, ప్రజాస్వామిక విలువల్లో భారత్ బలంగా ఉంది. ఆర్ అండ్ డీపై నిధులు పెంచడం, పరిశ్రమలు–విశ్వవిద్యాలయాల అనుసంధానం మెరుగుపరచడం, కీలక రంగాల్లో మిషన్ మోడ్ ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా భారత్ ముందడుగు వేయగలదు. సరైన దూరదృష్టి, నిరంతర పెట్టుబడులు, బాధ్యతాయుత విధానాలతో సాగితే భారత్ చైనాతో సమాన స్థాయికి, అంతకు మించి ఎదిగే సామర్థ్యం కలిగి ఉంది. శాస్త్రసాంకేతిక రంగాన్ని జాతీయ ప్రాధాన్యంగా భావించి దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడితే భారత్ ప్రపంచ స్థాయిలో కీలకంగా ఎదిగే అవకాశం ఉంది.