India LPG Imports: భారత్ వంటగ్యాస్ను ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇటీవలి ఇరాన్–అమెరికా యుద్ధం, హర్మూజ్ మూసివేత కారణంగా చమురుతోపాటు ఎల్ప్పీజీ సంక్షోభం కూడా తలెత్తింది. భారత్–ఇరాన్ మధ్య ఉన్న సాన్నిహిత్యంతో సంక్షోభాన్ని చాలా వరకు అధిగమించింది. అయితే ఇదే సమయంలో ఎల్పీజీ ధరలను పెంచింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభం తలెత్తకుండా వంట గ్యాస్ అవసరాల్లో అమెరికా వాటాను గణనీయంగా పెంచుకోవాలని నిర్ణయించింది. 2027 నాటికి మొత్తం ఎల్పీజీ దిగుమతుల్లో 25 శాతం అమెరికా నుంచి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ప్రస్తుత పరిస్థితి ఇదీ..
2025లో భారత్ మొత్తం 21.85 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ దిగుమతి చేసుకుంది. దీనిలో సుమారు 90 శాతం పశ్చిమాసియా(గల్ఫ్) దేశాల నుంచే వచ్చింది. దేశీయ వినియోగంలో దిగుమతులు దాదాపు 66 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ ఏకపక్ష ఆధారం వల్ల ఏదైనా ప్రాంతీయ ఉద్రిక్తత లేదా సరఫరా అంతరాయం వస్తే వంటగ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇటీవలి కాలంలో ఇలాంటి అంతరాయాలు ఎదురైన నేపథ్యంలోనే ఈ కొత్త వ్యూహం రూపుదిద్దుకుంది.
అమెరికా వైపు చూపు..
ఎల్పీజీ దిగుమతి విషయంలో గల్ఫ్ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు సరఫరా మార్గాలను వైవిధ్యపరచడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. ఇదేసమయంలో అమెరికాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి కూడా ఇది సహాయపడుతుంది. భారత్–అమెరికా మధ్య వాణిజ్య అసమతుల్యతను తగ్గించేందుకు ఇంధన దిగుమతులు పెంచాలనే ఒత్తిడి ఉంది. ఈ నిర్ణయం ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగు.
టెండర్లు, చర్చలు
చమురు కంపెనీలు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం త్వరలోనే 2027 సరఫరాల కోసం టెండర్లు విడుదల చేయనున్నాయి. కంపెనీల ప్రతినిధి బృందం అమెరికా వెళ్లి సరఫరాదారులతో చర్చలు జరపనుంది. ఇప్పటికే 2026లో అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులు గణనీయంగా పెరిగాయి. అయితే అమెరికా నుంచి రవాణా దూరం ఎక్కువ కాబట్టి లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పోర్ట్ సౌకర్యాలు, నిల్వ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉంటుంది. భారత్లో ఎల్పీజీ ధరలు పెరిగే అవకాశం ఉంది.
తాజా నిర్ణయం భారత ఇంధన విధానంలో ముఖ్యమైన మార్పును సూచిస్తోంది. కేవలం ధర లేదా సౌలభ్యం కాకుండా, భద్రత, వైవిధ్యీకరణపై దృష్టి పెట్టడం సానుకూలం. 2027 లక్ష్యం సాధిస్తే భారత ఎల్పీజీ సరఫరా వ్యవస్థ మరింత స్థిరంగా మారుతుంది.