Parvathipuram: ప్రభుత్వ ఆస్పత్రి.. అనగానే అమ్మో సర్కార్ దవాఖానానా అంటారు చాలా మంది. నేనురాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని ఓ సినీ గేయ రచయిత నాటి పరిస్థితుల ఆధారంగా పాట కూడా రాశాలు. కానీ మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న సౌకర్యాలతో సర్కార్ దవాఖానాల్లోనూ మెరుగైన సేవలు అందుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులుతోపాటు, ప్రసవాల కోసం వచ్చే గర్భిణుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ప్రైవేటు వైద్యం ఖరీదు కావడం కూడా చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రికి రావడానికి కారణమవుతోంది. అయితే ఆర్థికంగా ఉన్నా.. అదికారం చేతిలో ఉన్నా.. కూడా ఓ కలెక్టర్ తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం చేయించి ఆదర్శంగా నిలిచారు.
పార్వతీపురం కలెక్టర్..
ఆయన ఒక జిల్లాకు కలెక్టర్. జిల్లా పాలన యంత్రాంగానికి అయనే సుప్రీమ్. ఒక్క ఫోన్ చేస్తే కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు సైతం ఆయన ఇంటికి వచ్చి మరీ వైద్య సేవలు అందిస్తారు. అంతటి అవకాశం ఉన్నా వాటన్నింటినీ పక్కనపెట్టి ప్రభుత్వ దవాఖానాలోనే తన భార్యకు ప్రసవం చేయించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు, శస్త్ర చికిత్సలు, ప్రసవాలు అంటే ఇప్పటికీ ప్రజల్లో కొంత భయం, ఆందోళనలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత గల పరికరాలు, మెరుగైన వైద్యం అందదనే భావన కొందరిలో కనిపిస్తుంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులను ఎంత అభివృద్ధి చేసినా రోగులు మాత్రం దాదాపు ప్రవేట్ ఆసుపత్రిలో వైద్యం తీసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. ఈ భావన పట్టణాల్లోనే ఉందంటే.. ఇక అమాయక గిరిజనుల విషయంలో చెప్పల్సిన పనిలేదు. దీంతో అడవిబిడ్డలు అధికంగా ఉన్న ఆ జిల్లాలో ఇలాంటి అపోహలను కొంతవరకైనా తొలగించాలని ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన భార్య ప్రసవాన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించాలని నిర్ణయించుకున్నారు.
ప్రసవం మహిళకు మరో జన్మ..
సహజంగా ప్రతీ వ్యక్తి వివాహం, పిల్లల పుట్టుక విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మహిళకు ప్రసవం మరో జన్మగా భావిస్తారు. దీంతో పేద, మధ్య తరగతి వారు సైతం అప్పో సొప్పో చేసి తమ స్తోమతకు మించి మరీ మెరుగైన వైద్యంతో కూడిన ప్రసవం కోసం కార్పొరేట్ ఆసుపత్రుల బాట పడుతుంటారు. కానీ, మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాత్రం ఆర్థికంగా, అధికారికంగా స్థితిమంతుడిగా ఉన్నా కార్పొరేట్ ఆసుపత్రి వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. అంతే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవానికి సిద్ధమై తన భార్యను పార్వతీపురం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అలా జాయిన్ అయిన కలెక్టర్ భార్యకు గైనకాలజిస్ట్ వాగ్దేవి మెరుగైన వైద్యం అందించి పండంటి మగబిడ్డను చేతిలో పెట్టారు. ప్రసవం క్షేమంగా జరిగి తల్లీ బిడ్డ సురక్షితంగా ఉన్నారు. తన బిడ్డను చూసుకున్న కలెక్టర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మొదటి ప్రసవం కూడా..
నిశాంత్కుమార్ తన భార్య మొదటి కాన్పు కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేయించారు. అప్పుడు ఆయన రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్నారు. దీంతో ప్రసవం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోనే తన భార్యకు ప్రసవం చేయించారు. మొదటి కాన్పులో ఆడబిడ్డ కాగా, రెండవ కాన్పులో మగబిడ్డ పుట్టాడు. రెండు ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగడమే కాదు.. రెండు సార్లు తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయనే సందేశం ఇచ్చారు కలెక్టర్ నిశాంత్ కుమార్.