Homeట్రెండింగ్ న్యూస్Smart Phobia : భారతీయుల్లో స్మార్ట్‌ ఫోబియా.. ఫోన్ పట్టుకుంటే చాలు అంతే ఇక!

Smart Phobia : భారతీయుల్లో స్మార్ట్‌ ఫోబియా.. ఫోన్ పట్టుకుంటే చాలు అంతే ఇక!

Smart Phobia : స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చాక.. ప్రపంచం అరచేతిలో కనిపిస్తోంది. కావాల్సిన సమాచారం, వినోదం, సోషల్‌ మీడియా, కోరుకున్న సినిమాలు… ఇతరాత్రా క్షణాల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ మన జీవితాలు మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఫోన్‌ బానిసలు పెరుగుతున్నారు. స్మార్ట్‌ ఫోనే ప్రపంచంగా మారుతోంది. అది లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఫోన్‌ కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా వెంటనే టెన్షన్‌ పెరిగిపోతోంది. ఇలాంటి వారంతా ఒక రకమైన ఫోబియాతో బాధపడుతున్నట్టు. భారత్‌లో స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నవారిలో 75 శాతం మందికి ఇదే ఫోబియా పట్టుకుంది. ఈ విషయం ఒప్పొ, కౌంటర్‌పాయింట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఫోబియాని నోమో ఫోబియా అని పిలుస్తారు. అంటే నో మొబైల్‌ ఫోబియా అని అర్థం.
ఫోన్‌ లేకుంటే ఆందోళన.. 
స్మార్ట్‌ ఫోన్‌ పని చేయకపోయినా, సిగ్నల్స్‌ లేకపోయినా, కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా విపరీతమైన ఆందోళనకి గురికావడం, ఏదో కోల్పోయినట్టుగా ఉండడం, నిస్సహాయంగా మారిపోవడం, అభద్రతా భావానికి లోనవడం వంటివి దీని లక్షణాలు. భారతీయులు ప్రతీ నలుగురిలో ముగ్గురికి ఈ ఫోబియా ఉందని ఆ అధ్యయనం తేల్చింది. దేశంలోని టైర్‌ 1, టైర్‌ 2 నగరాల్లో 1,500 మంది స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులపై ఒప్పొ ఈ అధ్యయనం నిర్వహించింది. బ్యాటరీ లైఫ్‌ కోసం స్మార్ట్‌ ఫోన్లని మార్చే వారు చాలా మంది ఉన్నారని, ఒకరకంగా ఈ సర్వే తమ ఉత్పత్తులకి కూడా కీలకంగా మారిందని ఒప్పొ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ దమయంత్‌ సింగ్‌ ఖనోరియా చెప్పారు.
సర్వే ఫలితాలు ఇలా.. 
– బ్యాటరీ సరిగా పనిచేయడం లేదని 60% మంది ఏకంగా తమ స్మార్ట్‌ ఫోన్లు మార్చుకున్నారు.
– ఫోన్‌ దగ్గర లేకపోతే మహిళల్లో 74 శాతం మంది ఆందోళనకు లోనవుతారు. పురుషులు మరింత అధికంగా 82% మంది ఒత్తిడికి లోనవుతారు
– బ్యాటరీ ఎక్కడ అయిపోతుందోనని 92% మంది వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పవర్‌ సేవింగ్‌ మోడ్‌ని వినియోగిస్తున్నారు
– చార్జింగ్‌లో ఉండగా కూడా ఫోన్‌ వాడే వారు 87% మంది ఉన్నారు
– వినోద కార్యక్రమాలు చూడడానికే 42% స్మార్ట్‌ ఫోన్లు వినియోగిస్తున్నారు. అందులో సోషల్‌ మీడియాదే అగ్రస్థానం.
స్మార్ట్‌ ఫోన్‌తో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. దుష్ప్రభావాలు కూడా అన్నే ఉన్నాయంటున్నారు నిపుణులు. వాటి నుంచి బయట పడడానికి అందరూ ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular