Double Decker Buses In Hyderabad: నిజాం కాలంలో హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవట.. ఆ తర్వాత రెండు దశాబ్ధాల క్రితం కూడా హైదరాబాద్ నగర రోడ్లపై ఈ బస్సులు పరుగులు పెట్టాయి. ఆ తర్వాత ఏమైందో కానీ ఫ్లై ఓవర్లు.. ఇతర బ్రిడ్జీల రాకతో ఈ బస్సులను ఆర్టీసీ క్రమంగా తగ్గించేసింది. నిర్వహణ భారం కారణంగా కూడా ఆర్టీసీ వీటిని ఒక్కొక్కటిగా సర్వీసు నుంచి తప్పింది. దీంతో హైదరాబాద్ చారిత్రక చరిత్రకు సాక్ష్యంగా ఉన్న డబుల్ డెక్కర్ బస్సులు చరిత్ర పుటల్లోకి చేరాయి.

మళ్లీ ఇన్నాళ్లకు వీటిని తిరిగి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది 10 డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వంతెనలు, ఆటంకాలు లేని రూట్లలో వీటిని నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ఏడాది 300, వచ్చే ఏడాది 310 మొత్తం 610 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి సమకూరనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీటిని నడిపిస్తారు. ఈ బస్సుల్లో 10 డబుల్ డెక్కర్ బస్సులు ఉండడం విశేషం.

అశోక్ లేలాండ్ సంస్థ ద్వారా ఈ డబుల్ డెక్కర్ బస్సులు కొనాలని టెండర్లలో నిర్ణయించారు. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.2 కోట్లకు పైగానే ఉంది. కేంద్రం ఇచ్చే రాయితీ రూ.30 లక్షలకే పరిమితం కావడంతో ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. ఇప్పుడు వీటిని అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఆర్టీసీకి అందనున్న 310 బస్సులు అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోవాలని డిసైడ్ అయ్యింది.