Kangana Ranaut: సంచలన కామెంట్స్ కి హీరోయిన్ కంగనా రనౌత్ కేర్ ఆఫ్ అడ్రస్. కొన్నాళ్లుగా ఆమె బాలీవుడ్ పెద్దలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఆమె ఆరోపణల్లో నిజమెంతో పక్కన పెడితే నెపో కిడ్స్ తో పాటు కొందరు దర్శక నిర్మాతలకు కంగనా పూర్తి వ్యతిరేకం. బాలీవుడ్ మాఫియా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని అవుట్ సైడర్స్ ని తొక్కేస్తున్నారనేది ఆమె ప్రధాన ఆరోపణ. ఇటీవల ప్రియాంక చోప్రా ఇదే అభిప్రాయం వెల్లడించారు. అమెరికాలో ‘ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్ విత్ డాక్స్ షెపర్డ్’ అనే పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా బాలీవుడ్ మీద విమర్శలు గుప్పించారు.
‘పరిశ్రమ నన్ను పక్కన పెట్టేసింది. కొందరు నాకు అవకాశాలు రాకుండా చేశారు. ఈ క్రమంలో కొందరితో గొడవలయ్యాయి. బాలీవుడ్ లో రాజకీయాలు ఎక్కువ. అవి చేయడం నాకు రాదు. అందుకే అక్కడ ఇమడ లేక బయటకు వచ్చేశాను’ అని అన్నారు. ప్రియాంక కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ వార్తను ఇండియన్ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది.
ప్రియాంక చోప్రా కామెంట్స్ కి మద్దతు తెలుపుతూ బాలీవుడ్ పెద్దల మీద కంగనా రనౌత్ విరుచుకుపడ్డారు. ఆమె దర్శక నిర్మాత కరణ్ జోహార్ మీద ఫైర్ అయ్యారు. ప్రియాంక చోప్రాను ఒక గ్యాంగ్ టార్గెట్ చేసింది. ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. స్వయంకృషితో ఎదిగిన ప్రియాంక చోప్రా ఇండియా వదిలి పారిపోయేలా చేశారు. ప్రియాంక చోప్రాను ఇబ్బంది పెట్టింది కరణ్ జోహార్ అని అందరికీ తెలుసు అంటూ… కంగనా సంచలన కామెంట్స్ చేశారు.
షారుక్ ఖాన్ తో సన్నిహితంగా ఉంటున్న ప్రియాంక చోప్రా మీద కరణ్ జోహార్, బాలీవుడ్ మీడియా కుట్ర పన్నింది. ఆమె గురించి తప్పుడు రాతలు రాశారు. దేశం వదిలిపోయే వరకు వేధింపులకు గురి చేశారు. ఒకప్పుడు బాలీవుడ్ లో స్నేహపూరిత వాతావరణం ఉండేది. ఈర్ష్య, ద్వేషంతో నిండిన వ్యక్తుల విషపు ఆలోచనల వలన బాలీవుడ్ సంస్కృతి నాశనం అవుతుంది. అవుట్ సైడర్స్ ని ఎదగనీయకుండా చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని.. కంగనా తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజాగా కాజల్ అగర్వాల్ సైతం బాలీవుడ్ మీద ఆరోపణలు చేశారు. బాలీవుడ్ లో విలువలు, నైతికత లేదు. సౌత్ ఇండియన్ పరిశ్రమలో మంచి వాతావరణం ఉంది. అందుకే అక్కడ గొప్ప నటులు, గ్రేట్ టెక్నీషియన్స్ అవతరిస్తున్నారని అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు బాలీవుడ్ పెద్దలే కారణమని భావించిన నెటిజెన్స్ కరణ్ జోహార్, అలియా భట్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, మహేష్ భట్ వంటి ప్రముఖులను ఏకిపారేశారు.