
MLA Raja Singh: రాజాసింగ్.. ఈయన తెలియనివారు ఉండరు. గోషామహల్ రాజసింగ్ ఏది చేసినా సంచలనమే. కరుడుగట్టిన హిందూ వాదిగా, హిందుత్వమే ఊపిరిగా ఆయన సంచలన కామెంట్లు చేస్తుంటారు. గో పరిరక్షణకు పెద్ద ఉద్యమమే నడుపుతున్నారు. హిందూ ధర్మ ప్రచారంలో అగ్రభాగాన ఉంటారు. ఇక ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని ఆయన చేసే వ్యాఖ్యలతో ఇటీవల పీడీయాక్ట్ కుడా ఓపెన్ చేశారు. సుమారు మూడు నెలలు జైల్లో ఉండొచ్చారు. ఆయనకు తరచూ బెదిరింపు కాల్స్ కూడా వస్తుంటాయి. కోర్టు ఆదేశాలతో రాజాసింగ్కు ప్రభుత్వం భత్రత పెంచింది. బుల్లెట్ పూఫ్ర్ వాహనం కూడా కేటాయించింది.
డొక్కు వాహనంపై అసంతృప్తి..
తెలంగాణ ప్రభుత్వం మంత్రులకు కొత్త కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయిస్తూ.. రాజాసింగ్కు మాత్రం డొక్కు వాహనాలు కేటాయించింది. దీనిపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కేటాయించిన వాహనం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం డోర్ వేసిన తర్వాత తీస్తే లాక్ పడుతోందని, లాక్ తీసినా డోర్ ఓపెన్ కాదంటూ గతంలో వ్యాఖ్యానించారు.
వాహనం మార్చాలని వినతి..
తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు తనకు ఏర్పాటు చేసిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనికిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీకి గత నవంబర్లో లేఖ కూడా రాశారు. ‘నాకు కేటాయించిన వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందంటూ పలుమార్లు పోలీసు శాఖ దృష్టికి తీసుకొచ్చినా.. తిరిగి అదే వాహనాన్ని కేటాయిస్తున్నారు. 2010 మోడల్కు చెందిన వాహనంలో అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను.. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్గం మధ్యలోనే నిలిచిపోతోంది.. ఇటీవల కొంత మంది ఎమ్మెల్యేలకు నూతన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారు. ఆ జాబితాలో నా పేరు లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. తనకు తీవ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని ఉన్న విషయం పోలీసులకు తెలుసని.. అయినా తన భద్రత విషయంలో అలసత్వం వహిస్తున్నారంటూ వివరించారు. దీని వల్ల ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు తనపై దాడి చేసేలా అవకాశం కల్పిస్తున్నారన్నారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేకపోతే.. తనకు కేటాయించిన వాహనాన్ని తిరిగి తీసుకోండి. పాత వాహనాన్ని వినియోగించలేను అని వివరించారు. తరచూ అగిపోతున్న వాహనాన్ని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపితే రిపేర్ చేసి ఇచ్చారని తెలిపారు.
తాజాగా తృటిలో తప్పిన ప్రమాదం..
ఇటీవల అఫ్జల్ గంజ్ మీదుగా రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తుండగా.. మధ్యలో మొరాయించింది. దీంతో అసహనానికి గురైన ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోవడంతో అక్కడి నుంచి మరో వాహనంలో ఇంటికి చేరుకున్నానని తెలిపారు. దీనిపై రాజాసింగ్ అభిమానులు ప్రభుత్వాన్ని తిట్టిపోశారు. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో రాజాసింగ్కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు టైర్ ఊడిపోయింది. అయితే, కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం జరగలేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఇంటికి వెళ్తుండగా ధూల్పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి రాజాసింగ్ సురక్షితంగా బయటపడ్డారు.

రాజాసింగ్ నిరసనతో దిగొచ్చిన సర్కార్..
రాజాసింగ్ నిరసనలతోపాటు, ప్రభుత్వం తీరుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో తెలంగాణ సర్కార్ దిగొచ్చింది. మరోవైపు ఇటీవల రాజాసింగ్కు బెదిరింపు ఫోన్కాల్స్ పెరుగుతున్నాయి. చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. తాజాగా వచ్చిన ఫోన్కాల్స్పై డీజీపీకి లేఖ కూడా రాశారు రాజాసింగ్. మరోవైపు ఆయన డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇటీవల ప్రగతి భవన్ ముందు వదిలేసేందుకు ప్రయత్నించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం రాజాసింగ్కు కొత్త వాహనం ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ఇంటెలిజెన్స్ అధికారులకు సూచింది. ఎట్టకేలకు మంగళవారం రాజాసింగ్కు కొత్త వాహనం కేటాయించారు.
ఏది చేసినా కాంట్రవర్సీ అయ్యే రాజాసింగ్.. తన వ్యక్తిగత బుల్లెట్ వాహనం విషయంలోనూ కాంట్రవర్సీ అయి కొత్తది సాధించుకున్నారు.