Facebook Cheating: కీర్తి సురేశ్.. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్.. సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న ఆమె స్వయంగా మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఎలా ఉంటుంది. గుండెజారి గల్లంతవడం ఖాయం.. అంతేకాదు చాటింగ్ కూడా చేస్తే.. ఇక జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె మహానటి కాదని.. మహా మోసగత్తె అని తెలిస్తే.. ఊహించుకోవడానికి హాస్యంగా అనిపించినా.. అదే జరిగింది. ‘మహానటి’ సినిమాలో అలనాటి హీరోయిన్ సావిత్రి పాత్రలో నటించిన క్యూట్ హీరోయిన్’ కీర్తి సురేష్’ ఎవరికి తెలియదో చెప్పండి. తన నటనతో సినీ ప్రేక్షకుల మనసు దోచిన కీర్తి సురేష్ తన అందంతో కుర్రాళ్లకు కనువిందు చేస్తుంది.

ఫేస్బుక్ డీపీ చూసి..
ఫేస్బుక్ ఫొటోను చూసి, ఆమె పెట్టిన రిక్వెస్ట్కు స్పందించిన ఓ యువకుడు ఆమెతో చాట్ చేయడం ప్రారంభించాడు. మహానటే తనతో చాట్ చేస్తుందని ఊహల్లో తేలిపోయాడు. పెళ్లి దశకు కూడా వెళ్లేంత వరకు వీరి చాటింగ్ కొనసాగింది. ఇంతలో బిగ్ ట్విస్ట్ బయటికొచ్చింది.
ఫేస్బుక్ పరిచయం..
కర్ణాటక రాష్ట్రంలోని విజయపూర్ జిల్లా సిందగి తాలూకాలోని బగలూరు గ్రామానికి చెందిన పరశురామ అనే యువకుడు హైదరాబాద్లో భవన నిర్మాణ కార్మికులకు సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తూ నెలకు రూ.30 వేల జీతం తీసుకుంటున్నాడు. పరశురామకు ఫేస్బుక్లో కర్ణాటకలోని హాసన్కు చెందిన మంజుల అనే ఇద్దరు పిల్లలు ఉన్న మహిళతో పరిచయం ఏర్పడింది. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. మంజుల తన ఫేస్ బుక్ డీపీ దగ్గర తన ఫొటోకి బదులుగా కీర్తి సురేష్ ఫొటోని ఉంచింది. ఆమె ఫేస్ బుక్ డీపీని చూసి పరశురామ మైమరచిపోయాడు. అయితే అది హీరోయిన్ ఫొటో అని పరశురామకి తెలియదు. తనకు పరిచమైన అమ్మాయి హీరోయిన్లా ఉందని తెగ మురిసిపోయేవాడు. గాల్లో తేలిపోతుండేవాడు. ఫేస్బుక్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ రోజూ చాటింగ్లో మునిగితేలేవారు.
రూ.40 లక్షలు నాకేసింది..
ఈ క్రమంలో మంజుల తనకు చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయి,తాను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పడం ప్రారంభించింది. ఆమె మాటలకు కరిగిపోయాడు పరశురాయ. ఆమె చదువుల కోసం ఇంట్లో పొదుపు చేసిన ఐదు లక్షల నగదు, ప్లాట్తో సహా అన్నీ అమ్మేసి డబ్బులు పంపేవాడు. ఫోన్పే ద్వారా సుమారు రూ.40 లక్షల వరకు డబ్బులు పంపినప్పటికీ అతడు ఆమెను కలవలేదు. ఎన్నిసార్లు కలుద్దామన్నా ఇప్పుడు కాదు అప్పుడు కాదు అంటూ తప్పించుకునేది మంజుల.
డబ్బులు తిరిగి అడగడంతో..
తన ప్రేయసి విషయంలో ఏదో తేడా కొడుతుంది అని భావించిన పరశురామ తన డబ్బులు తనకు ఇచ్చేయాలని అడిగాడు. దీంతో మంజుల ఓ ప్లా్లాన్ వేసింది. ఓ రోజు పరశురామకి తన ఫేస్ కనబడకుండా వీడియో కాల్ చేసి మాట్లాడుతుండగా…నువ్వు నాతో మాట్లాడుతూ స్నానం చేయ్యి అని పరశురామకి చెప్పింది. దానికి పరశురామ సంతోషంతో గంతులేస్తూ స్నానం చేస్తూ వీడియో కాల్ మాట్లాడాడు. అయితే పరశురామ స్నానం చేస్తుండగా వీడియో కాల్ చేసి రికార్డు చేసింది మంజుల. ఆ తర్వాత ఆ వీడియో గురించి పరశురామకి తెలిపి.. బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది.

మోసపోయానని గ్రహించి..
కి‘లేడీ’ మోసంతో మనస్తాపానికి గురైన పరశురామ నవంబర్ 15న సిందగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో మంజుల చేసిన మోసం గురించి పూర్తిగా వివరించాడు. ఆయన ఫిర్యాదు చేసిన కేసును సీరియస్గా తీసుకున్న ఎస్పీ ఆనంద్కుమార్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితురాలు మంజులను అదుపులోకి తీసుకున్నారు. ఆమె హాసన్ జిల్లా చన్నరాయపట్నం తాలూకా దాసరల్లి గ్రామం. పోలీసులు రావడంతో సమాచారం తెలుసుకున్న మంజుల భర్త పరారయ్యాడు. పరశురామ నుంచి వసూలు చేసిన డబ్బుతో మంజుల.. 100 గ్రాముల బంగారం, హ్యుందాయ్ కారు, బైక్ కొనుగోలు చేసి పట్టణంలో ఇల్లు కూడా నిర్మిస్తోంది. ఈ మోసానికి మంజుల భర్త పూర్తిగా మద్దతు ఇచ్చినట్లు తెలిసింది. మొత్తంగా ఓ ఫేస్బుక్ డీపీ ఆ యువకుడిని అన్నీ అమ్ముకునేలా చేసింది.