Bihar: రక్త సంబంధం కంటే ఆస్తుపాస్తులకే విలువ ఇచ్చే రోజులివి. ఆస్తుల కోసం కుటుంబ సభ్యులను హత్య చేసిన వారి గురించి ప్రతి రోజూ వింటున్నాం. ఇక భూ తగాదాలు గురించి అయితే కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ప్రతి గ్రామంలోనూ అంగుళం భూమి దగ్గర కూడా గొడవలు జరుగుతుండడం, ఈ గొడవలు రక్త పాతానికి కూడా దారి తీస్తుండడం చూసే ఉంటాం. తల్లిదండ్రుల కంటే ఆస్తులకే ప్రాధాన్యతను ఇచ్చే బిడ్డల సంఖ్య పెరిగిపోయింది. ఆస్తికోసం పేగు బంధాన్ని వదులుకుంటున్నారు ఎంతో మంది. అయితే, ఇందుకు విరుద్ధంగా వ్యవహరించాడు ఒక వ్యక్తి. తల్లి కోరికను నెరవేర్చేందుకు తనకు ఉన్న భూమిని ప్రభుత్వానికి విరాళంగా అందించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఎవరా వ్యక్తి..? దాని వెనకున్న కారణం ఏమిటి..? అన్న విషయాలను మీరు చదివేయండి.
దేశంలో రోజురోజుకు భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఎకరం భూమి కోట్లాది రూపాయల పలుకుతుంది. దీంతో తమకున్న అంగుళం భూమిని కూడా వదులుకునేందుకు ఎవరో ఇష్టపడడం లేదు. భూమికోసం సోదరులు, పిల్లలు గొడవలు పడుతున్న సందర్భాలు అనేకం. అయితే ఒక రైతు మాత్రం తన తల్లి కోరిక నెరవేర్చేందుకు తనకున్న కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశాడు. ఆ వ్యక్తి గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు వేదికగా తెగ చర్చ జరుగుతోంది.
పాఠశాల భవన నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చిన రైతు..
బీహార్ లో భాగల్పూర్ జిల్లాలో కార్పూర్ అనే గ్రామం ఉంది. ఇది జిల్లా కేంద్రమైన భాగల్పూర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, ఈ గ్రామానికి సమీపంలో ఉన్న కోసినది నీటి మట్టం పెరగడం వల్ల ఇక్కడ భూమి కోతకు గురవుతూ ఉంటుంది. దీని వల్ల 2020 లో ఈ గ్రామ శివారులో ఉన్న ఏకైక ప్రభుత్వ పాఠశాల కూడా నీటిలో మునిగిపోయింది. దీంతో విద్యార్థులు వేరే ఊరిలో ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కొంతమంది అయితే అలా వేరే చోటికి వెళ్లే సదుపాయం లేక చదువే మానేశారు. అయితే, ఈ గ్రామంలో కొత్త పాఠశాల భవనం నిర్మించడానికి ప్రభుత్వ అధికారులు స్థలం కోసం వెతకడం ప్రారంభించారు. కానీ వాళ్లకు కావాల్సిన స్థలం దొరకలేదు. దీంతో అదే గ్రామానికి చెందిన చరికా దేవికి ఈ విషయం తెలిసింది. దాంతో తమకున్న భూమిని పాఠశాల భవన నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని తన కొడుకు సుబోధియాను కోరింది. తన తల్లి కోరిక తీర్చడానికి సుబోదియా దాదాపు 8 వేల చదరపు అడుగుల స్థలాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చాడు.
తల్లి పేరు పెట్టాలని కోరిన సుబోదియా..
లక్షలాది రూపాయల విలువైన భూమిని ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి దానం చేసిన సుబోదియా అందుకు ప్రతిగా ఒక సహాయాన్ని అధికారులను కోరాడు. భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులను పూర్తిచేసిన ఆయన అధికారుల ముందు ఒక ప్రతిపాదన పెట్టాడు. ఈ స్కూల్ లో చదువుకునే విద్యార్థులు తన తల్లిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, అందుకోసం అక్కడ నిర్మించబోయే స్కూల్ కి తన తల్లి పేరు పెట్టాలని సుబోదియా అధికారులను కోరగా, అందుకు విద్యాశాఖ అధికారులు కూడా అంగీకరించారు. ఈ గజం స్థలం కోసం కొట్లాడుకుంటున్న ప్రస్తుత రోజుల్లో నిస్వార్ధంగా ఇంత భూమిని విరాళంగా ఇచ్చిన సుబోదియా తన తల్లి కోరిక మన్నించి భూమిని దానం చేయడం గొప్ప విషయం అని పలువురు కొనియాడుతున్నారు.