Corruption: కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విపరీతంగా తనిఖీలు చేస్తున్నారు. సమాచారం రావడం ఆలస్యం.. అన్ని ఆధారాలు సేకరించి అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఏసీబీ అధికారులు చేస్తున్న దాడుల్లో చాలామంది అవినీతి అధికారులు దొరికిపోతున్నారు. వారిని చట్ట ప్రకారం జైలుకు పంపిస్తున్నారు.. ఇంత జరుగుతున్నప్పటికీ అవినీతి అధికారులు మారడం లేదు. పైగా వారి సంపాదన వందల కోట్లను కూడా దాటిపోతుంది. చివరికి ఏసీబీ అధికారులకు ప్రత్యేకంగా నోట్ల ను లెక్కించడానికి యంత్రాలు కావలసి వస్తోంది.
కొన్ని సందర్భాలలో ఏసీబీ అధికారులు ఫిర్యాదులు లేకుండానే.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోకుండానే.. అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఇటీవల రహదారులు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ విషయంలో కూడా ఏసీబీ అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. భారీగా డబ్బు సంపాదించి.. ఒక్క ఆధారం కూడా లేకుండా చేసి.. కాలర్ ఎగరేసిన మోహన్ నాయక్ కు అధికారులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. వాస్తవానికి ఏసీబీ అధికారులు అతడి ఇంటికి వెళ్ళగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎటువంటి కంప్లైంట్లు లేకుండా నా ఇంటికి ఎందుకు వచ్చారని అతడు ప్రశ్నిస్తే.. లెక్కలతో సహా చెప్పి చుక్కలు చూపించారు అధికారులు.
మోహన్ నాయక్ ఆర్ అండ్ బి లో రీసెర్చ్ ఆఫీసర్ గా 1995లో చేరాడు. ఇన్ని సంవత్సరాల అనుభవంలో అతడు చీఫ్ ఇంజనీర్ దాకా వెళ్ళాడు. అయితే ఏసీబీ అధికారులు అతని మీద కేసు నమోదు చేసే వరకు ఆదాయం 3.94 కోట్లు ఉంది. అయితే కుటుంబ సభ్యుల ఖర్చులను దాదాపు మూడు కోట్ల 89 లక్షలు గా అధికారులు గుర్తించారు. ఆయనకు సేవింగ్స్ ద్వారా మిగిలినవి కేవలం నాలుగు లక్షల 43000 మాత్రమే. ప్రాథమిక విచారణలో మోహన్ నాయక్ ఆస్తులను అధికారులు 7.90 కోట్లుగా గుర్తించారు. ఇందులో సేవింగ్స్ ను పక్కన పెడితే ఏడు కోట్ల 86 లక్షల ఆస్తులను ఆయన అక్రమంగా వెనకేసినట్టు తెలుస్తోంది. 30 సంవత్సరాల పాటు ఆయన ఈ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు. చట్టబద్ధంగా అతడికి ఉండాల్సిన సేవింగ్స్ కంటే అదనంగా 7.86 కోట్ల ఆస్తులు సంపాదించడంతో ఏసీబీ అధికారులకు అనుమానం వచ్చింది. తనకు వస్తున్న రాబడి కంటే దాదాపు 177 రెట్లు అక్రమంగా మోహన్ నాయక్ సంపాదించినట్టు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
మోహన్ నాయక్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నప్పుడు పోలీసులకు దిమ్మతిరిగిపోయే ఆస్తులు కనిపించాయి. బహిరంగ మార్కెట్లో వాటికి ఏకంగా 200 కోట్ల వరకు విలువ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మోహన్ నాయక్ సేవింగ్స్ మీద దృష్టి పెట్టిన పోలీసులకు అనుమానాలు రావడంతో దర్యాప్తు మొదలుపెట్టారు. దీంతో మోహన్ నాయక్ బాధితులు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అతని వసూళ్ల వ్యవహారాన్ని పోలీసులకు వివరించారు. దీంతో మోహన్ నాయక్ అవినీతి చిట్టా బయటికి వచ్చింది. అతని వసూళ్ల పుట్ట పగిలిపోయింది. ఏకంగా 200 కోట్ల వరకు అక్రమ ఆస్తులను సంపాదించాడు అంటే మోహన్ దందా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

