Warangal Karimnagar Pentacity: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అధికారం చేపట్టిన వెంటనే మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నా.. నిదానంగా ముందుకు సాగుతున్నారు. ఇక వర్షాకాలంలో చిన్న వర్షానికి కూడా హైదరాబాద్ ముంపునకు ప్రధాన చెరువుల ఆక్రమణలే అని గుర్తించారు. దీంతో చెరువులను చెర విడిపించేందుకు కబ్జాలకు చెక్ పెట్టేందుకు హైడ్రా ఏర్పాటుచేశారు. ఇక తర్వాత హైదరాబాద్ను మరింత విస్తరించేందుకు ఫ్యూచర్ సిటీకి ప్లాన్ చేశారు. ఈమేరకు కొత్త సిటీకి శంకుస్థాపన కూడా చేశారు. పనులు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు హైదరాబాద్పై ఒత్తిడి తగ్గించే వ్యూహంలో భాగంగా పెంటా సిటీ ప్లాన్ చేస్తున్నారు.
కరీంనగర్లో కీలక ప్రకటన..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటనలో వరంగల్, కరీంనగర్ను జంట నగరాలుగా అభివృద్ధి చేస్తూ పెంటాసిటీ కారిడార్ను ప్రకటించారు. హైదరాబాద్పై రద్దీ, కాలుష్యం తగ్గించి ఉపాధి అవకాశాలను వికేంద్రీకరించే లక్ష్యంతో ఈ సంకల్పం. వరంగల్, హన్మకొండ, కాజీపేట త్రినగరులకు హుజూరాబాద్ మధ్యస్థంగా కలిపి 60–70 మండలాల విస్తృత ఆర్బన్ బెల్ట్గా మార్చే ప్రణాళిక ఇది.
ముఖ్య ప్రాజెక్టులు..
రెండు నగరాల వెలుపల రింగ్ రోడ్లను అనుసంధానం చేసి రవాణా వ్యవస్థను వేగవంతం చేస్తారు. మధ్యలో బయో–వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటుతో మున్సిపల్ వ్యర్థాలను విద్యుత్గా మార్చి పర్యావరణ హితం చేస్తారు. ఐటీ హబ్, ఇతర ఉపాధి కేంద్రాల స్థాపనతో గ్రామీణ ప్రాంతాలకు ఉద్యోగాలు చేరువ చేస్తారు.
ఆర్థిక విభజన..
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు భాగాలుగా విభజించిన ముఖ్యమంత్రి CURE(హైదరాబాద్ లోపల నెట్ జీరో సర్వీసెస్), PURE (ఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య తయారీ రంగాలు), RARE (వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు). ఈ పెంటాసిటీ ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణకు మరో హైదరాబాద్లా మార్చి సమతుల్య ప్రగతి సాధిస్తుంది.
ప్రధాన ప్రయోజనాలు ఇవీ..
పెంటాసిటీ మూలంగా హైదరాబాద్లో ఐటీ, పరిశ్రమలు, జనాభా వికేంద్రీకరణ జరుగుతంది. దీంతో రద్దీ, కాలుష్యం నియంత్రణ సాధ్యమవుతుంది. వరంగల్ విద్యా కేంద్రం (ఎన్ఐటీ, కాకతీయ యూనివర్సిటీ), కరీంనగర్తో ఐటీ–మేకింగ్ లింకేజ్లు జరుగుతాయి. మామునూరు ఎయిర్పోర్ట్ పూర్తి, స్కిల్ సెంటర్లు, రవాణా నెట్వర్క్ మెరుగులతో పెట్టుబడుల ఆకర్షణతో మౌలిక వసతుల విస్తరణ జరుగుతుంది. హైదరాబాద్కు యువత వలసలు తగ్గి, టౌన్షిప్లు, మాల్స్, ఆసుపత్రులతో పరోక్ష ఉద్యోగాలు పెరుగుతాయి. భూ విలువల పెరుగుదల, వ్యాపార కేంద్రాలు విస్తరిస్తాయి.
