HomeతెలంగాణRevanth's Strategy To Hurt BRS: బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టే రేవంత్ పన్నిన వ్యూహమిదీ

Revanth’s Strategy To Hurt BRS: బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టే రేవంత్ పన్నిన వ్యూహమిదీ

Revanth’s Strategy To Hurt BRS: కాకతీయుల కాలం నుంచి వరంగల్‌కు ఉన్న పేరు, హోదా అంతాఇంతా కాదు. ఇటు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనూ వరంగల్‌కు అలాంటి హోదానే దక్కింది. అయితే.. పదేళ్ల తరువాత ఇప్పుడు ఆ నగరానికి మరింత ప్రాముఖ్యత పెరిగిందనే చెప్పాలి. అందులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత వరంగల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. అందులోభాగంగా ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్‌ను రెండో రాజధాని స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణలోనే అతిపెద్ద నగరమైన వరంగల్ రాష్ట్రానికి రెండో రాజధాని అంటూ ప్రకటించారు. దీంతో మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అయితే.. పొంగులేటి చెప్పినట్లుగా వరంగల్‌కు అంతటి స్టేటస్ కూడా ఉంది. కానీ.. తెలంగాణ సెంటిమెంటుతో గెలిచిన పార్టీ బీఆర్ఎస్ వరంగల్‌ను పెద్దగా పట్టించుకోలేదు. అందుకే.. ఈ అంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ నెత్తినేసుకుందని తెలుస్తోంది.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్నారు. దాంతో ఆయన ముందు నుంచి వరంగల్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. మొన్న ఈ మధ్య వరంగల్‌ను సందర్శించిన ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంలోనూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రకాళి చెరువు పరిధిలో కబ్జాలను ఉపేక్షించబోమని చెప్పారు. అంతేకాకుండా వరంగల్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేస్తామని అన్నారు. వరంగల్ నగరానికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్‌ మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని వెల్లడించారు. అటు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొచ్చి.. మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామన్నారు. ముంపు బారి నుంచి నగరాన్ని కాపాడుతామన్నారు. అలాగే.. వరంగల్ వాసుల కల అయిన విమానాశ్రయాన్ని కూడా పూర్తిచేస్తామని వెల్లడించారు. ఏడాదిలోపే విమానాశ్రయం నిర్మిస్తామని చెప్పారు. మామునూరులో ఇప్పటికే ఉన్న ఎయిర్ పోర్టును కేంద్రం సాయంతో మళ్లీ ట్రాక్ మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే.. వరంగల్‌ను టార్గెట్ వెనక పెద్ద ప్లానింగే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేయాలని కాంగ్రెస్ భావిస్తోందట. ఈ మూడు జిల్లాల్లో గులాబీ పార్టీని పూర్తిగా కనుమరుగు చేస్తే ఆ పార్టీ ఇక భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చని కాంగ్రెస్ అనుకున్నదంట. ఖమ్మంలో ఆ పార్టీకి పునాదులు లేకుండా అయింది. కనీసం ఒక్క సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారు. నల్లగొండలోనూ ఇక సేమ్ పరిస్థితి. నల్లగొండలోనూ కాంగ్రెస్ హవానే కొనసాగుతోంది. ఉద్యమం వేళ మాత్రం ఈ రెండు జిల్లాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లోనూ పార్టీ ఉనికి లేకుండా పోయింది. దీంతో మరోసారి అక్కడ అవకాశం దొరకకుండా చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్. అందుకే.. వరంగల్‌ రెండో రాజధాని పేరుతో ఆ జిల్లా వాసులకు బీఆర్ఎస్ పార్టీని దూరం చేయబోతున్నారన్న టాక్ నడుస్తోంది. ఇక ఇతర జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ స్కెచ్‌లు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ముందు ముందు అన్నిజిల్లాల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి ఇదే పరిస్థితి ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular