CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని స్వయం సహాయ సంఘాల మహిళలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇçప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది. మహిళా సంఘాలకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాం స్టిచ్చింగ్ బాధ్యతలు అప్పగించింది. తర్వాత అంగన్వాడీ విద్యార్థులకు యూనిఫాం ప్రవేశపెట్టి ఆ బాధ్యతను కూడా డీఆర్డీఏకే కేటాయించింది. తర్వాత ప్రతీ పంచాయతీలో మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని అర్హులైన మహిళలకే మంజూరు చేస్తోంది. ఇక రేవంత్ సర్కార్ మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్లను కూడా మహిళల పేరిట మంజూరు చేస్తామని ప్రకటించింది. వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపింది.
తాజాగా మరిన్న వరాలు..
ఇక తాజాగా తెలంగాణ సర్కార్ మహిళా సంఘాల సభ్యుల బలోపేతానికి మరిన్ని వరాలు ప్రకటించింది మహిళా శక్తి పథకం కింద పాడి పశువులు, దేశవాలీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, మిల్క్ పార్లర్లు, సంచార చేపల విక్రయ కేంద్రాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
నిర్వహణకు రుణాలు..
ఇదిలా ఉంటే.. వీటి నిర్వహణకు కూడా ప్రభుత్వమే బ్యాంకులు, స్త్రీనిధి, మండల మహిళా సమాఖ్యల ద్వారా రుణం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు జిల్లాల వారీగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
– మండలానికి ఒకటి చొప్పున పౌల్ట్రీఫాం ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకు రూ.2.91 లక్షల చొప్పున రుణం మంజూరు చేస్తారు. సొంత స్థలం ఉండి షెడ్డు వేసుకుని కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకునేందుకు మందుకు వచ్చేవారికి దీనిని వర్తింపజేస్తారు.
– ఇక నాటుకోళ్లు ఒక్కో జిల్లాలో రూ.3 కోట్ల విలువైన కోళ్లు 2 వేల మందికి మంజూరు చేస్తారు. ఇందుకు ఒక్కో సభ్యురాలుకు రూ.15 వేల చొప్పున రుణం మంజూరు చేస్తారు. ఈ పథకం కింద 20, 50, 100 దేశవాలీ కోళ్లు మంజూరు చేస్తారు.
– పాడి పశువుల యూనిట్లను ప్రతీ జిల్లాకు రూ.4.50 కోట్లతో 500 మంది మహిళా సమాఖ్యల సభ్యులకు మంజూరు చేస్తారు. ఇందుకు రూ.90 వల రుణసాయం సంఘాల్లోని ఒక్కో సభ్యురాలికి ఇస్తారు. ఈమేరకు ఒకటి లేదా రెండు పశువులను కొని ఇస్తారు. లబ్ధిదారు కచ్చితంగా మహిళా సంఘం సభ్యురాలై ఉండాలి.
– మండలానికి ఒకటి చొప్పున మహిళా సంఘాలకు మిల్క్ పార్లర్లు మంజూరు చేస్తారు. బస్టాండ్లు, సినిమా థియేటర్లు, రైతుబజార్లు, రైల్వే స్టేషన్లు ఉండే ప్రాంతాల్లో సంఘాల సభ్యురాళ్లకు ఈ పథకాల కింద అవకావం కల్పిస్తారు. ఒక్కో మిల్క్ పార్లర్ ఏర్పాటుకు రూ.1.90 లక్షల రుణం మంజూరు చేస్తారు.
– సంచార చేపల విక్రయ కేంద్రాలు కూడా మంజూరు చేస్తారు. ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల రుణంతో మండలానికి ఒక యూనిట్ ఇస్తారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మత్స్య సంపత్ యోజన కింద 60 శాతం సబ్సిడీ లభిస్తుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More