Telangana Municipal Elections Results: సరిగ్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐదు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో పెత్తనం మొత్తం కేటీఆర్ ది కాబట్టి.. అడ్డగోలుగా నిబంధనలు మొత్తం మార్చేశాడు. తన పార్టీ మాత్రమే గెలిచే విధంగా విధానాలు రూపొందించాడు. సీన్ కట్ చేస్తే సింహ భాగం మున్సిపాలిటీలలో గులాబీ పార్టీ గెలిచింది. ప్రతిపక్ష కాంగ్రెస్ గెలిచిన చోట కూడా బీఆర్ఎస్ ఆర్థిక బలంతో తొక్కి పారేసింది. క్యాంపు రాజకీయాలు స్టార్ట్ చేసింది.. కొంతమంది అభ్యర్థులను ఏకంగా అపహరించింది. ఇదే ప్రజాస్వామ్యం అంటూ కొత్త సూత్రీకరణకు దిగింది.
ఇప్పుడు రేవంత్ పరిపాలన లోకి వద్దాం. ఇదేదో రేవంత్ గురించి భజన చేసే కార్యక్రమం కాదు. ఆయన పరిపాలనకు చిడతలు వాయించే వ్యవహారం అంతకంటే కాదు. బాధ్యత గల మీడియా సంస్థగా మా దృష్టికి వచ్చిన అంశాలను మా వీక్షకులకు అందించడం కోసమే ఈ కథనం పబ్లిష్ చేస్తున్నాం.
తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా తేడా ఉంటుంది. తెలంగాణలో సామాజికంగా.. రాజకీయంగా.. ఇతర వ్యవహారాలలో ప్రజలలో చైతన్యం విపరీతంగా ఉంటుంది. నచ్చిన వాళ్లను తెలంగాణ ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు. అదే నచ్చని వాళ్ళని అయితే నేలకేసి కొడతారు. ఇందులో ఈ పార్టీ.. ఆ పార్టీ అని తేడా లేదు. అన్నిటికీ ఒకే విధమైన ట్రీట్మెంట్ ఇస్తారు తెలంగాణ ప్రజలు.
సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఏకపక్షంగా మున్సిపల్ ఫలితాలను సాధించిన గులాబీ పార్టీ.. ఈసారి జరిగిన ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను సాధించింది. కానీ ఇక్కడే కాంగ్రెస్ పార్టీ గులాబీ పార్టీకి అసలు సిసలైన ప్రజాస్వామ్య విలువలను బోధించింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దర్పాన్ని పెద్దగా వినియోగించలేదు. గులాబీ పార్టీ మాదిరిగా ఏకపక్షంగా వ్యవహరించలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా మీకు మంచి చేసే వాడిని ఎన్నుకోవాలని సూచించారు. మీకు కష్టాలు వస్తే ఆదుకునే వ్యక్తికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆ సూత్రాన్నే తెలంగాణ ప్రజలు ఆచరించారు.
అందువల్లే అధికార పార్టీకి గొప్పగా చెప్పుకునే స్థానాలు వచ్చాయి. ప్రతిపక్షాలకు గౌరవప్రదమైన స్థానాలు లభించాయి. ఎవరిని కూడా తక్కువ చూపు చూడలేదు తెలంగాణ ఓటర్లు. బిజెపికి బలం ఇచ్చారు. గులాబీ పార్టీకి పునర్జన్మ ఇచ్చారు. అధికార కాంగ్రెస్ పార్టీకి అండదండగా నిలిచారు. ఫలితంగా తెలంగాణ అంటేనే విభిన్న తత్వమని మరోసారి నిరూపించారు. 2023 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి భారీగా మెజారిటీ ఇవ్వలేదు. అలాగని గులాబీ పార్టీని తక్కువ చూపు చూడలేదు. ప్రతిపక్షాన్ని గౌరవంగా ఉంచుకుంటూనే.. మార్పు కావాలని కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ ప్రజలు వ్యవహరించిన తీరు వల్ల ప్రజాస్వామ్యం గొప్పగా వర్ధిల్లింది. “ఈసారి ఎన్నికలు బాగా జరిగాయి. చాలా స్థానాలలో హంగ్ ఏర్పడింది. ఈ ప్రకారం ఎన్నికల ప్రక్రియ ఎంత గొప్పగా జరిగిందో అర్థం చేసుకోవచ్చని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.