HomeతెలంగాణCM Revanth Reddy : సడన్‌గా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికెళ్లాడు..? ఏంటా కథ..?

CM Revanth Reddy : సడన్‌గా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికెళ్లాడు..? ఏంటా కథ..?

CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు అవుతోంది. ఈ పది నెలల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లారో లెక్కలు కూడా లేవు. అందుకే సమయం చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్ నేతలు కూడా ఆయన ఢిల్లీ ప్రయాణాలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి వరకే రేవంత్ అని.. కీ అంతా అధిష్టానం చేతుల్లోనే అని విమర్శిస్తూనే ఉన్నారు. నిర్ణయాధికారం రేవంత్ చేతుల్లో లేదని.. ఏ చిన్న విషయమైనా ఢిల్లీ వెళ్లి అక్కడ చర్చించిన తరువాతే రేవంత్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటుంటారు. సరే.. రేవంత్ ఢిల్లీ ప్రయాణాలు ఎందుకోసమైనా.. ఎన్నిసార్లు వెళ్లినా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని కాంగ్రెస్ వాదన.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. నిన్న రాత్రికి రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లారు. ఇటీవల జమ్ములో ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆకస్మా్త్తుగా అనారోగ్యానికి గురయ్యారు. కళ్లు తిరిగి పడిపోయారు. దాంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయనను పరామర్శించేందుకే సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. వైద్య చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శిందుకే రేవంత్ ఢిల్లీ వెళ్లారని సీఎంవో వర్గాలు సైతం చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా.. మరికొద్ది రోజుల్లో రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దానిపైనా కూడా రేవంత్ చర్చించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 12 మందితో కూడిన మంత్రివర్గం ఉండగా.. మరో ఆరుగురికి ఛాన్స్ ఉంది. ఈ ఆరు బెర్త్‌ల కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఆశావహుల సంఖ్య పదుల సంఖ్యలో ఉంది. జిల్లాల వారీగా రోజురోజుకూ వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే అధిష్టానంతో ఈ విషయమై చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్లి రేవంత్ చర్చించినప్పటికీ ఇంతవరకు కొలిక్కి రాలేదు.

దసరా ముహూర్తం పెట్టి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని రేవంత్ భావిస్తున్నారు. దాంతో అధిష్టానం వద్ద తొరగా తేల్చుకొని రావాలని రేవంత్ ఢిల్లీ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. హైకమాండ్ నేతలంతా హర్యానా, కశ్మీర్ ఎన్నికల బిజీలో ఉన్నారు. దాంతో వారితో సమావేశం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే.. కేవలం ఖర్గేను పరామర్శించేందుకు వెళ్లారని పార్టీలో ప్రచారం నడుస్తోంది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 5తో ముగియనున్నా్యి. ఆ ఎన్నికలు ముగిసిన తరువాతనే మరోసారి సీఎం ఢిల్లీ వెళ్లి చర్చిస్తారని కూడా వినిపిస్తోంది.

వీటితో పాటు.. ఇప్పుడు రాష్ట్రంలో హైడ్రా హల్‌చల్ అయింది. మంచి లక్ష్యంతో హైడ్రాను తీసుకొచ్చినప్పటికీ అది కాస్త ప్రభుత్వానికి వ్యతిరేకతను తీసుకొచ్చింది. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. అందుకే.. వారికి వివరణ ఇచ్చుకునేందుకే ఢిల్లీ బాట పట్టారన్న ప్రచారమూ జరుగుతోంది. అలాగే.. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఈడీ దాడుల అంశాన్ని కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. కాగా.. రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఢిల్లీ వెళ్లడం ఇది 23వ సారి.

 

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular