కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఈటల బర్తరఫ్ కు ఇప్పుడు తలో రకమైన కారణాన్ని చెబుతున్నారు. తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ ను అసలు సీఎం కేసీఆర్ ఎందుకు తొలగించాడన్నది అసలు కారణం ఇప్పటివరకు అధికారికంగా బయటపడలేదు. అటు కేసీఆర్ చెప్పలేదు. ఇటు ఈటల ‘తన తప్పేంటో చెప్పాలని’ డిమాండ్ చేశారు.
అందరూ అనుకుంటున్నట్టు ఈటల రాజేందర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఈటల కొంప ముంచాయనుకుంటే పొరపడ్డట్టేనని తెలంగాణ సీఎం కేసీఆర్ సోదరుడి కూతురు రమ్య రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈటల రాజేందర్ ను తొలగించడం వెనుక ఒక శకుని ఉన్నాడంటూ ఆమె నిజాలు చెప్పుకొచ్చారు.
మంత్రిగా ఉన్న సమయంలో ఈటల రాజేందర్ ఎంతో ముచ్చటపడి ఒక పెద్ద రాజభవనం లాంటి ఇల్లును కట్టుకున్నాడు. దానికి సీఎం కేసీఆర్ ను భోజనానికి పిలిచి మర్యాద చేశాడు. కొత్త ఇంటి గృహ ప్రవేశానికి కేసీఆర్ రావడం.. అతిథి మర్యాదలు అందుకొని ఫిదా అయిపోయాడు.
అయితే కేసీఆర్ సోదరభావంతోనే ఈటలను అభినందించి భోజనం చేసి వెళ్లిపోయాడు. కానీ తర్వాతే కథ మొదలైందని రమ్యారావు చెబుతున్నారు. ఆ శకుని ఏకంగా ఈటల ఇంటిపై కన్నేశాడని.. కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ కంటే పెద్ద ఇల్లు కట్టుకున్న ఈటల రాజేందర్ పై అక్కసు వెళ్లగక్కి లేనివి ఉన్నవి కల్పించి కేసీఆర్ కు చెప్పి ఆయనను బయటకు పంపారని రమ్యారావు సంచలన నిజాలు చెప్పుకొచ్చారు.
ఈటట విషయంలో కేసీఆర్ ఇంటెలిజెన్స్ రిపోర్టు తెప్పించుకున్నా. దానికంటే ముందే ఆ శకుని ఆ రిపోర్టును మార్చేసి ఈటలకు వ్యతిరేకంగా మార్చి కేసీఆర్ కు పంపారని రమ్యారావు ఆరోపించారు. ఈటల గురించి నెగెటివ్ గా రిపోర్టు ఇప్పించి మంత్రివర్గం నుంచి ఆ శకునియే ఈటలను తొలగించేలా చేశారని రమ్యారావు హాట్ కామెంట్స్ చేశారు.
అయితే ఆ శకుని పాత్రధారి ఎవరన్నది మాత్రం రమ్యారావు చెప్పలేదు. కానీ కేసీఆర్ ప్రగతి భవన్ లోనే ఉండే కేటీఆర్ కావచ్చు అన్న గుసగుసలు వినిపిస్తున్నారు. రమ్యారావు ఆ ఇంటర్వ్యూలో శకుని పేరు చెప్పకున్నా.. ఆమె చెప్పినదాన్ని బట్టి ఆ శకుని పాత్ర ధారి ఎవరో గుర్తు పట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రమ్యారావును ఇంటర్వ్యూ చేసిన సదురు జర్నలిస్టు సైతం ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించడం విశేషం.