HomeతెలంగాణPonguleti Srinivasa Reddy: మామిడి తోట కేంద్రంగా.. ఫోన్ ట్యాపింగ్.. పొంగులేటి బయటపెట్టిన నిజం!

Ponguleti Srinivasa Reddy: మామిడి తోట కేంద్రంగా.. ఫోన్ ట్యాపింగ్.. పొంగులేటి బయటపెట్టిన నిజం!

Ponguleti Srinivasa Reddy: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నిన్నా మొన్నటివరకు ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరిగాయి. మునిసిపల్ ఎన్నికల హడావిడిలో ఆ అంశం కాస్త పక్కన పడింది. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా .. రెవెన్యూ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనూహ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు…

శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో ఏదులాపురం మున్సిపాలిటీ ఉంది. ఈ మున్సిపాలిటీకి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని దక్కించుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విస్తృతంగా ప్రచారంతోపాటు.. వ్యూహాలు కూడా అమలు చేస్తున్నారు.

ఇటీవల శ్రీనివాస్ రెడ్డి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న టీఎన్జీవో కాలనీలో ఉద్యోగులతో గ్రూప్ కాల్ మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ గ్రూప్ కాల్ లో చాలామంది ఉద్యోగులు పాల్గొని.. మంత్రితో మాట్లాడారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది.. మంత్రితో మాట్లాడుతున్న గ్రూప్ కాల్ ను కొంతమంది ఉద్యోగులు రహస్యంగా రికార్డు చేశారు. దాన్ని కాస్త గులాబీ పార్టీ నేతలకు అందించారు..

గులాబీ పార్టీ నేతలు విలేకరుల సమావేశం పెట్టి మంత్రి మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియోను విడుదల చేశారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి మంత్రి అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారని.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలా ఉద్యోగులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మారుస్తున్నారని ఆరోపించడం మొదలుపెట్టారు. దీనికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. గతంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న తాతా మధు ఉద్యోగులతో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను బయటపెట్టారు. దీంతో ఖమ్మంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశంలో ఇంకా సంచలన విషయాలను వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గులాబీ పార్టీ నేతలు తన ఫోన్ వింటున్నారని.. మామిడి తోట కేంద్రంగా.. ఫామ్హౌస్ కేంద్రంగా తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని.. గతంలో తాను ఫోన్ ట్యాప్ అయిన విషయాన్ని బయటపెట్టానని.. ఇప్పుడు అది అధికారికంగా గులాబీ పార్టీ నేతలే ఒప్పుకున్నారని.. తన ఫోన్ కాల్స్ బయటికి ఎలా వెళ్లాయో.. ఎవరి ద్వారా వెళ్లాయో గులాబీ పార్టీ నేతలు చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేస్తున్నారు. మామిడి తోట కేంద్రంగా.. ఫామ్ హౌస్ కేంద్రంగా ఫోన్ ట్యాప్ చేస్తున్న వ్యక్తులు బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే అంత మంది ఉద్యోగులు పాల్గొన్న ఆ గ్రూప్ కాల్ లో ఎవరు వాయిస్ రికార్డు చేసి.. గులాబీ పార్టీ నేతలకు పంపించారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మంత్రి అనుచర గణం లోతుగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular