Municipal Elections: తెలంగాణలో 11 ఫిబ్రవరి మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. ఏడు కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. హామీలు గుప్పిస్తున్నారు. ఇక నేతలు కూడా రంగంలోకి దిగారు. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్కు కీలకంగా మారాయి. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఉత్తర తెలంగాణలో బీజేపీ ఆధిక్యం..
కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ బలం ఎక్కువ. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ ఎంపీల ప్రభావం కార్పొరేషన్లపై పడనుంది. అందుకే వీరు అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్నీ తామై చూసుకుంటున్నారు. ఇక కొత్త కార్పొరేషన్ మంచిర్యాలలో హిందుత్వ భావాలు ఎక్కువే. బీజేపీకి యువతలో పట్టు ఉంది. కానీ, ఎంపీ గడ్డం వంశీ, మంత్రి గడ్డం వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పట్టు కారణంగా రెండు పార్టీలు సమానంగా పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో కీలక కార్పొరేషన్ రామగుండం. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, మంత్రి శ్రీధర్ బాబు అన్నీ తామై చూసుకుంటున్నారు. ఇక్కడ హస్తం హవా కొనసాగే అవకాశం ఉంది. గతంలో రెండుసార్లు ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది.
దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలప్రదర్శన
దక్షిణ తెలంగాణలోని నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్కు మంచి పట్టు ఉంది. ఇక్కడ గెలవకపోతే కోమటిరెడ్డి మంత్రి పదవికే సవాల్గా మారనుంది. అందుకే కోమటిరెడ్డి సోదరులు అన్నీతామై చూసుకుంటున్నారు. ఇక ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు చాలా తక్కువ. బీఆర్ఎస్ కొంచెం ప్రభావం చూపవచ్చు. సీఎం సొంత జిల్లాలో ఉన్న మహబూబన్గర్ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఎంపీ డీకే.అరుణ ఉండడంతో బీజేపీ కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఉమ్మడి ఖమ్మంపై కాంగ్రెస్ పట్టు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కార్పొరేషన్లు కాంగ్రెస్ గెలుపు దాదాపుగా ఖాయం. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్ రావు కాంగ్రెస్ గెలుపుకు కీలకం. పార్టీ అధికార ప్రయోజనం, స్థానిక నాయకుల ప్రభావం ఇక్కడ బలపడింది. ఇతర పార్టీలు పోటీ పడినా, కాంగ్రెస్ జెండా ఎగురుతుందని అంచనా.
ఈ ఎన్నికలు స్థానిక సమస్యల పరిష్కారం కూడా కీలకమే. బీజేపీ ఉత్తరంలో, కాంగ్రెస్ దక్షిణంలో బలం చూపుతుంది. ఓటర్లు అభివృద్ధి వాగ్దానాలు, పార్టీ లీడర్షిప్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫలితాలు రాష్ట్ర రాజకీయాలకు సూచనలు ఇస్తాయి.
