TS Schools : తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వరుసగా చిక్కుల్లో పడుతున్నారు. తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో కానీ.. విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్డంగా బుక్కవుతున్నారు. గతేడాది బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలిపితే… విద్యార్థుల సమస్యలను సిల్లీ అంటూ వ్యాఖ్యానించి తొలిసారి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అక్కడి నుంచి మొదలైన చిక్కులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు పాఠశాలలకు మంత్రి సెలవులు ప్రకటించారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లిన తర్వాత ట్విట్టర్లో సెలవులు అని సబిత పోస్టు చేశారు. దీనిపై తల్లిదండ్రులు మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిని సామాజిక మాధ్యమం వేదికగా ట్రోల్ చేశారు.
సెలవులు ఇవ్వాలని కోరిన ఓ విద్యార్థి తల్లి..
తెలంగాణలో మళ్లీ బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అనవసరంగా బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పిల్లలను స్కూళ్లకు పంపించడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ చిన్నారి తల్లి ట్విటర్ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్కూళ్లకు సెలవులను ప్రకటించాలని కోరింది.
మంత్రి తనయుడి రిప్లయ్..
అయితే ఈ ట్వీట్కు మంత్రి సబిత స్పందించలేదు. కానీ ఆమె కుమారుడు స్పందించాడు. తానే మంత్రిని అన్న రేంజ్లో వెటకారంగా రిప్లయ్ ఇచ్చాడు. మంత్రి కుమారుడి రిప్లయ్ చూసిన ఆ తల్లితోపాటు నెటిజన్లకు పట్టరాని కోపం వచ్చింది. అసలు రిప్లయ్ ఇవ్వడానికి మీరెవరు? మీరేమైనా మినిస్టరా? అని నిలదీశారు.
వెటకారంగా రిప్లయ్..
వర్షం వస్తోంది కాబట్టి.. విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాక సెలవు ప్రకటిస్తే ప్రయోజనం ఉండదని, ముందుగా స్పందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఓ విద్యార్థి తల్లి ట్విటర్ వేదికగా కోరారు. దీనికి మంత్రి కుమారుడు కార్తీక్రెడ్డి ‘మీ వెటకారం అర్థమయ్యింది. ప్రభుత్వం ఏమీ ట్విటర్లో నడవదని గ్రహించండి. ఇటీవల మంత్రి సెలవులపై 8.15కి ట్వీట్ చేశారు. కానీ ఆ శాఖ ముందుగానే నిర్ణయం తీసుకుంది. ట్విటర్లో ట్రోలింగ్ చేయడం సులభం. కామన్ సెన్స్ ఉపయోగించండి’ అని పేర్కొన్నారు.
చెంప చెళ్లుమనే సమాధానం..
కార్తీక్రెడ్డి రిప్లయ్ చూసిన సదరు విద్యార్థి తల్లి.. ‘మీరు చూపించిన శ్రద్ధకు అభినందనలు కార్తీక్.. కానీ అది విద్యాశాఖ మంత్రికి నేను చేసిన విన్నపం. మీరు సమాధానం ఇచ్చారంటే కొంపదీసి మీరు విద్యాశాఖామంత్రా?’ అని కామెంట్ పెట్టారు. అంతేకాదు.. కార్తీక్రెడ్డి తానేదో మంత్రిలా ఫీలైపోతున్నారని.. తాను పిల్లలపై ఉన్న కన్సర్న్తో మంత్రిని అడిగిన చిన్న ప్రశ్నకు వెటకారంగా సమాధానమిస్తున్నారని పేర్కొన్నారు. మొత్తానికి కార్తీక్ రెడ్డికి చెంప చెళ్లుమనేలా రిప్లయ్ వచ్చింది.
దెబ్బకు దిగివచ్చి…
విద్యార్థి తల్లితోపాటు చాలా మంది పేరెంట్స్ కార్తీక్ వెటకార సమాధానంపై మండిపడ్డారు. ఈ దెబ్బకు కార్తీక్ దిగి వచ్చాడు. ‘కేవలం నేను ట్రోల్స్కి మాత్రమే సమాధానం ఇచ్చానని.. పిల్లలపై కస్నర్న్ చూపే తల్లిదండ్రులకు కాదన్నారు. మీరు ట్రోలరా? లేదంటే కన్సర్స్ ఉన్న తల్లా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి’ అని సమాధానం ఇచ్చారు. మంత్రి స్పందించకుండా ఆమె కొడుకు కార్తీక్రెడ్డి స్పందించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరి కొడుకు సమాధానంపై మంత్రిగారు ఏం చెప్తారో చూడాలి.