Rohit Reddy Case: ధర్మం అనేది అందరికీ ఒక తీరుగా ఉండాలి. న్యాయం అనేది అందరికీ ఒకే విధంగా లభించాలి. తప్పు చేస్తే పడే శిక్ష కూడా సమానంగా ఉండాలి. అలా కాకుండా ఆశ్రిత పక్షపాతాన్ని చూపిస్తేనే ఇబ్బంది కలుగుతుంది.. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం మొత్తం ఎందుకంటే.. ఈ స్టోరీ చదవండి మీకే తెలుస్తుంది.
లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత కల్వకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితి నుంచి ఒక రకమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అనేక రకాలుగా ప్రయాసపడితే ఆమె తండ్రి అపాయింట్మెంట్ లభించలేదు. అది కూడా నిమిషాల్లోనే జరిగిపోయింది. పార్టీలో తనకి ఎదురవుతున్న అనుభవాలను తట్టుకోలేక ఆమె విలేకరుల ముందుకు వచ్చారు. తన బాధను మొత్తం పంచుకున్నారు. ఆగమేఘాల మీద పార్టీ అధిష్టానం ఆమెను సస్పెండ్ చేసింది. దీంతో ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది. ఇప్పుడు సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఆమె ఉంది.
పార్టీ కోసం తాను ఎంతో కష్టపడితే ఇంత ఇబ్బంది పెడుతున్న క్రమంలో.. ఆమె వాస్తవాలను చెప్పడం మొదలుపెట్టారు. తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి పెద్దగా చేసింది ఏమీ లేదని.. సామాజిక తెలంగాణ ను ఏర్పాటు చేయడంలో భారత రాష్ట్ర సమితి విఫలమైందని ఆమె ఆరోపించారు. అంతేకాదు.. భూ కుంభకోణాలు.. ఇతర వ్యవహారాలను ఆమె బయట పెట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. హరీష్ రావును గుంట నక్క అని.. సంతోష్ రావును అవకాశవాది అని ఆమె విమర్శించుకుంటూ వస్తున్నారు.
ఇక ఇటీవల మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మాదకద్రవ్యాల పార్టీ నిర్వహించి వివాదంలో చెప్పుకున్నారు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఆయన వ్యవసాయ క్షేత్రంలో మాదకద్రవ్యాలు లభించిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యవహారంలో పోలీసులపై కాల్పులకు పాల్పడేందుకు రోహిత్ రెడ్డి అనుచరులు ప్రయత్నించారని అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ఇంకా చాలామందికి పాత్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తూ కీలకమైన విషయాలను బయటపెడుతున్నారు.. మాదకద్రవ్యాల పార్టీ వెలుగులోకి వచ్చిన తర్వాత రోహిత్ రెడ్డికి ఆలస్యంగా భారత రాష్ట్ర సమితి షోకాజు నోటీస్ ఇచ్చింది. వారంలో దీనికి సమాధానం చెప్పాలని గడువు ఇచ్చింది.
రోజులు గడుస్తున్న కొద్ది ఇంతవరకు రోహిత్ రెడ్డి షో కాజు నోటీసుకు సమాధానం చెప్పలేదు. అంతేకాదు, ఇంతవరకు రోహిత్ రెడ్డి మీద భారత రాష్ట్ర సమితి కఠినమైన చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. కవిత విషయంలో కఠినంగా వ్యవహరించిన భారత రాష్ట్ర సమితి.. రోహిత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి సైలెంట్ అయిపోయింది. అతడు శోకాజ్ నోటీస్ కు సరైన స్థాయిలో సమాధానం ఇవ్వకపోయినప్పటికీ భారత రాష్ట్ర సమితి పట్టించుకోవడం లేదు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తాం.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింది. ప్రజలను మోసం చేస్తోంది అని పదే పదే చెబుతున్న భారత రాష్ట్ర సమితి నాయకులు.. ఇంటి ఆడబిడ్డ విషయంలో ఒక విధంగా.. అభియోగాలు ఎదుర్కొంటున్న నాయకుడి విషయంలో మరొక విధంగా వ్యవహరించడం ఏ విలువలకు నిదర్శనం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.