CM Revanth Reddy
CM Revanth Reddy: నేరం కళ్ళముందే కనిపిస్తోంది. చేసిన వాడు ఎవడో కూడా అర్థమవుతూనే ఉంది. ఇలాంటప్పుడు నేరాన్ని నిరూపించి, నిందితుడిని చట్టం ముందు దోషిగా నిలబెట్టాలి. అదే సమర్ధుడి లక్షణం. అలాకాకుండా నేరం జరిగిన తీరు తెలిసినప్పటికీ.. నేరస్థుడు ఎవరో తెలిసిపోయినప్పటికీ.. కాలయాపన చేస్తూ ఉంటే అది సమర్థత అనిపించుకోదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రేవంత్ రెడ్డి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. అప్పట్లో ఆయన స్టీఫెన్ సన్ కు డబ్బులు ఇచ్చుకుంటూ దొరికిపోయారని అభియోగాలు మోపుతూ అప్పటి తెలంగాణ ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. జైలుకు పంపించారు. చివరికి తన కూతురి పెళ్లికి కూడా సరిగ్గా ఒకరోజు ఇంటి వద్ద ఉండని పరిస్థితి రేవంత్ రెడ్డికి ఎదురైంది. దీనంతటికీ కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు, కేసీఆరే నని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఆరోజున డబ్బులు ఇవ్వాల్సింది వేరే వ్యక్తులని.. కానీ రేవంత్ రెడ్డిని ఎర్రబెల్లి దయాకర్ రావు ఇరికించారని రేవంత్ వర్గీయులు చెబుతుంటారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు రేవంత్ ఫోన్ ట్యాప్ చేశారని.. అందువల్లే ఆయన ఇరుక్కున్నారని అంటుంటారు. అప్పట్లో కేసీఆర్ రేవంత్ రెడ్డిని జైలుకు పంపించడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని.. 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. కొడంగల్ నియోజకవర్గం లో గెలవకుండా చేశారని రేవంత్ అనుచరులు చెబుతుంటారు. కేసీఆర్ అలా ఇబ్బంది పెట్టినందు వల్లే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యేదాకా విశ్రమించలేదని ఆయన సన్నిహితులు వివరిస్తుంటారు.
కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపే దాకా విశ్రమించబోనని ఎన్నికల సమయంలో పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అలాంటి అవకాశం వచ్చినా చేజార్చుకుంటున్నారా? అంటే దీనికి అవును అనే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏర్పడిన పగుళ్ల నేపథ్యంలో కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించాలా? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే.. జ్యుడిషియల్ ఎంక్వయిరీ సరిపోతుందని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే జ్యూడిషల్ ఎంక్వయిరీ జరిగితే.. దానివల్ల జరిగేది ఏదీ ఉండదు. ఒకవేళ సిబిఐ ఎంక్వయిరీ కి గనుక ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకొని ఉంటే.. అప్పుడు ఆట మరో విధంగా ఉండేదని కేసీఆర్ జుట్టు రేవంత్ రెడ్డి చేతికి చిక్కేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఫోన్ ట్యాంపరింగ్ కేసులోనూ రేవంత్ ఇదే వ్యవహార శైలి అనుసరిస్తున్నారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ట్యాంపరింగ్ విషయంలో రేవంత్ రెడ్డి మొదటి బాధితుడని.. దానివల్ల ఆయన చాలా ఇబ్బందులు పడ్డారని.. ఇప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వానికి కీలక విషయాలు తెలిసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కేవలం అధికారులను అరెస్టు చేయడంతోనే ప్రభుత్వం ఆగిపోతుందేమోనని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు కీలకంగా వ్యవహరించారని, ఇటీవల కేటీఆర్ ట్యాంపరింగ్ చేశామని ఒప్పుకున్నారని.. అలాంటప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఇలానే వ్యవహరిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో రేవంత్ ఎలాంటి అడుగులు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Is cm revanth reddy not brave enough
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com