Hetero Parthasaradhi Reddy: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో నేడు పర్యటనకు వస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించబోతున్నారు. ఇందులో ఒక ప్రైవేట్ కార్యక్రమం కూడా ఉంది. సాధారణంగా మోడీ ప్రైవేట్ కార్యక్రమాలకు అంతగా ఆసక్తి చూపించరు. కానీ ఆయన తెలంగాణలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నారు. అది కూడా భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఓ రాజ్యసభ సభ్యుడిది. వాస్తవానికి బిజెపి, బీఆర్ఎస్ తెలంగాణలో బద్ధ శత్రువులుగా ఉన్నాయి. అయితే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ హాస్పిటల్ ను ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం ఇక్కడ చర్చనీయాంశం.
ప్రధానమంత్రి హైదరాబాదులో సింధు అనే ఆసుపత్రిని ప్రారంభించబోతున్నారు. ఈ ఆసుపత్రిని నిర్మించింది హెటిరో చైర్మన్, భారత రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధి రెడ్డి. తన కుమార్తె కృష్ణ సింధూరి జ్ఞాపకార్థం హైటెక్ సిటీలో పార్థసారధి రెడ్డి అద్భుతమైన క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. ఈ ఆసుపత్రి వెనుక ఒక ఆసక్తికరమైన రాజకీయ కథ ఉంది. 2018లో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ ప్రభుత్వం ఖానా మెట్ ప్రాంతంలో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని.. దీని విలువ దాదాపు 500 కోట్ల వరకు ఉంటుంది.. కేవలం 1.47 లక్షల వార్షిక అద్దెకు సాయి సింధు ఫౌండేషన్ కు కేటాయించింది. ఈ నేపథ్యంలో హెటిరో గ్రూప్ భారత రాష్ట్ర సమితికి 120 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసింది. ఇది జరిగిన కొద్దీ రోజులకే పార్థసారధి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే దీనిపై 2023లో హైకోర్టు జోక్యం చేసుకుంది. భూమి లీజు పూర్తిగా చట్ట విరుద్ధమని.. దీనిని ఒకసారి పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ భూమి కేటాయింపును తీవ్రంగా తప్పు పట్టారు. అధికారంలోకి వస్తే ఈ భూ కేటాయింపులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
సరిగా 2024 మార్చిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆ భవనంలో అప్పటికే ఆసుపత్రి నిర్మాణం సగం వరకు పూర్తయింది. దీంతో జీవో 37 ను కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసింది. ఆ తర్వాత ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. నాడు జైలుకు పంపిస్తానన్న రేవంత్ సైలెంట్ అయిపోయారు. ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓకే వేదిక మీద ఉంటారు. ఈ ఆస్పత్రి స్టోరీలో భూమి ఇచ్చింది భారత రాష్ట్ర సమితి.. తదుపరి నిర్మాణం పూర్తయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో.. బాధ్యత పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. మొత్తంగా మూడు పార్టీల వల్ల లబ్ధి పొందిన ఏకైక వ్యక్తి పార్థసారధి రెడ్డి. ఇలాంటి రాజకీయాలు తెలంగాణ రాష్ట్రానికి కొత్త కాదు. గతంలో చాలా జరిగాయి. ఇకముందు కూడా జరుగుతాయి.