Karimnagar Politics: రాజకీయ నాయకులు తెర ముందు మాత్రమే సవాళ్లు విసురుకుంటారు. కత్తులు దూసుకుంటారు. బస్తిమే సవాల్ అంటూ యుద్ధానికి దిగుతారు. కానీ ఆ యుద్ధంలో సమిధలు అయ్యేది కార్యకర్తలు మాత్రమే. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు రాజకీయ పార్టీ నాయకులు ఏనాడు కూడా పరస్పరం తగువులు పెట్టుకోరు. పోరాటాలు చేసుకోరు. మధ్యలో ఉన్న కార్యకర్తలు మాత్రమే బలి పశువులు అవుతుంటారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పార్లమెంటు సభ్యుడిగా బండి సంజయ్ కొనసాగుతున్నారు. ఆయన హోం శాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నారు. ఇదే జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ కొనసాగుతున్నారు. ఈయన గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఇదే జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వాస్తవానికి ఈ ముగ్గురు రాజకీయ నాయకుల మధ్య వైరం ఉంది. ఇటీవల కేంద్రమంత్రి కుమారుడు వ్యవహారంలో గంగుల కమలాకర్.. పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు కూడా చేశారు. గులాబీ పార్టీ నేతల ఆధ్వర్యంలో కరీంనగర్లో కేంద్ర మంత్రి కుమారుడి దిష్టిబొమ్మలు కూడా దహనం చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.
ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో సన్నివేశం ఏంటంటే.. బండి సంజయ్.. పొన్నం ప్రభాకర్.. గంగుల కమలాకర్ కలసి పోయారు. ఎన్నికల సమయంలో చేసుకున్న విమర్శలను మర్చిపోయారు. ఇటీవల కాలంలో చేసుకున్న ఆరోపణలను పక్కన పెట్టారు. ఒకే వేదిక మీద నవ్వులు చిందించారు. అద్భుతంగా ఫోటోలు దిగారు. సామూహికంగా భోజనాలు కూడా చేశారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అంటే రాజకీయ నాయకులు అనంతమాత్రాన పరస్పరం విరోధులుగా.. శత్రువులుగా ఉండాలని అని చెప్పడం లేదు.
రాజకీయ నాయకులు మాట్లాడే మాటల ద్వారా చాలామంది కార్యకర్తలు వైరాన్ని పెంచుకుంటున్నారు. శత్రుత్వాన్ని ప్రోది చేసుకుంటున్నారు. తద్వారా తమ మనుషులను అనే విషయాన్ని మర్చిపోయి పరస్పరం తగువులు పెట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో దాడులకు కూడా తెగబడుతున్నారు. అందువల్లే రాజకీయ నాయకులను చూసి కార్యకర్తలు నేర్చుకోవాలి. ప్రజలు ఇంకా నేర్చుకోవాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తారు. వ్యాపార విషయంలో.. వ్యక్తిగత సంబంధాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గరు. ఇక తాజాగా ఈ ముగ్గురు నాయకులు కలిసిన సందర్భం ఏంటంటే బండి సంజయ్ సోదరుడు బండి శ్రవణ్ కుమార్తె వివాహం జరిగింది. ఆ వివాహానికి ఈ ముగ్గురు హాజరయ్యారు. ఈ వివాహ వేదిక మీదుగానే వారి ముగ్గురు గట్టి సంకేతాలు ఇచ్చారు. తేల్చుకోవాల్సింది ఇక కార్యకర్తలే..