AIFB Wins Municipality: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి ఒక సంచలనం నమోదైంది. ప్రస్తుతం జరుగుతున్న ఫలితాల్లో అధికారం కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పార్టీల మధ్య పోటీ ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. ఇక బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ కూతురు, జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత మున్సిపల్ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వడ్ బ్లాక్(ఏఐఎఫ్బీ)కు మద్దతు ఇచ్చారు. కవిత నేతృత్వంలోని జాగృతి మద్దతుతో ఏఐఎఫ్బీ పోటీ చేసింది.
బోణీ కొట్టిన ఏఐఎఫ్బీ..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎఫ్బీ సంచలనం నమోదు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఎన్నడూ ఏఐఎఫ్బీ పెద్దగా ప్రభావం చూపలేదు. రామగుండం ఎమ్మెల్యేగా కోరుకంటి చందర్ 2018లో పోటీచేసి గెలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటిరెండు వార్డులు మాత్రమే గెలిచేది. కానీ ఈసారి కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని జాగృతి మద్దతుతో పోటీ చేసిన ఏఐఎఫ్బీ బోణీ కొట్టింది. ఆలంపూర్ నియోజకవర్గం పరిధిలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక్కడ పది వార్డులు ఉండగా, 8 వార్డుల్లో ఏఐఎఫ్బీ అభ్యర్థులు విజయం సాధించారు.
మిగతా చోట్ల స్వల్ప ప్రభావం..
ఇదిలా ఉంటే.. ఏఐఎఫ్బీ ప్రభావం ఇప్పటి వరకు వడ్డేపల్లి మినహా ఎక్కడా పెద్దగా కనిపించలేదు. పెద్దపల్లిలో 5 వార్డుల్లో గెలిచింది. ఇక సుల్తానాబాద్, మంథనిలో స్వల్పంగా పోటీ ఇచ్చింది. మంచిర్యాల కార్పొరేషన్లో కూడా స్వల్పంగా ప్రభావం చూసే అవకాశం ఉంది. స్వతంత్రులు చెప్పుకోదగిన స్థాయిలోనే గెలుస్తున్నారు. కానీ, ఏఐఎఫ్బీ ప్రభావం కనిపించలేదు.
కనిపించని జనసేన ప్రభావం..
ఇక మున్సిపల్ ఎన్నికల్లో జనసేన కూడా కొన్నిచోట్ల పోటీ చేసింది. ఖమ్మం జిల్లాలో ఎక్కువ స్థానాల్లో హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో కొన్నిచోట్ల జనసేన తరఫున అభ్యర్థులు బరిలో నిలిచారు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. టీడీపీ, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రచారానికి రావాలనుకున్నారు. కానీ బీజేపీ సూచనతో చేయలేదు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటి వరకు జనసేన ఒక్క వార్డులో కూడా గెలవలేదు.