Ambassador: అంబాసిడర్ కారు.. పరిచయం అక్కర్లేని పేరు. భారత ఆటోమొబైల్ మార్కెట్లో లెజెండ్. ట్రెండ్కు అనుగుణంగా అప్డేట్ అవ్వకపోవడంతో ‘సర్కారీ గాడి’ సేల్స్ తగ్గిపోయాయి. దీంతో హిందుస్తాన్ ఆటోమొబైల్ ఆ కార్ల తయారీ నిలిపివేసింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే కారు ఎలక్ట్రిక్ వెహికల్గా మార్కెట్కి పరిచయం కానుంది. త్వరలో విడుదల కానున్న ఈ కొత్త అంబాసిడర్ ఎలక్ట్రిక్ కార్ మోడల్ ఇలా ఉంటుందంటూ కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సీకే బిర్లా గ్రూప్కు చెందిన హిందుస్తాన్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(హెచ్ఎంఎఫ్సీఎల్) డైరెక్టర్ ఉత్తమ్ బోస్ సైతం అంబాసీడర్ కారు లుక్ ‘అంబోయ్’ తరహాలో ఉండనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చెన్నైలో తన సొంత కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో అంబాసిడర్ కారు మెకానికల్, డిజైన్ వర్క్తో పాటు అడ్వాన్స్గా స్టేజ్తో కొత్త ఇంజిన్ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం హిందుస్తాన్ మోటార్స్ ఫ్రెంచ్ కార్ మేకర్ పుజోతో చేతులు కలిపినట్లు పేర్కొన్నారు. ఆంబోయ్ మోడల్ తరహాలో ఉండే ఈ కారును 2024 ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు రాయిటర్స్ సైతం తన కథనంలో హైలెట్ చేసింది.
Ambassador
మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారీ..
గతంలో హిందుస్తాన్ మోటార్స్ చెన్నై మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో మిత్సుబిషి కార్లను, వెస్ట్ బెంగాల్ ఉత్తరపార తయారీ ప్లా్లంట్లలో అంబాసిడర్ కార్లను తయారు చేసేది. కానీ మిత్సుబిషి కార్ల డిమాండ్ తగ్గడంతో పీకల్లోతో నష్టాల్లో కూరుకుపోయింది. అందుకే హిందుస్తాన్ మోటార్స్ 2014 సెప్టెంబర్లో మిత్సుబిషి కార్ల తయారీని పూర్తిగా నిలిపివేసింది. మూడు సంవత్సరాల తర్వాత 2017లో అంబాసీడర్ కారు మ్యానిఫ్యాక్చరింగ్ హక్కుల్ని సైతం రూ.80 కోట్లకు ఫ్రెంచ్ కార్ మేకర్ పుజోకి అమ్మేసింది. తిరిగి మళ్లీ ఇప్పుడు చెన్నై ఫ్లాంట్లో హిందుస్తాన్ మోటార్స్ – పుజో భాగస్వామ్యంలో అంబాసిడరును కొత్త అవతార్లో తయారు చేస్తుంది.
Also Read: F3 Collections: ‘ఎఫ్ 3’ 4 రోజుల కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే ?
ఇదీ అంబాసిడర్ చరిత్ర..
భారత్కు స్వతంత్రం రాకముందు తొలిసారి హిందుస్తాన్ మోటార్స్(హెచ్ఎంఎఫ్సీఎల్) ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇండిపెండెన్స్ డే ముందు రోజుల్లో హెచ్ఎంఎఫ్సీఎల్ గుజరాత్ పోర్ట్ ఓఖా కేంద్రంగా అంబాసిడర్ కారు తయారీ ప్రయత్నాల్ని ప్రారంభించింది. కానీ నాటి అనేక కారణాల వల్ల అది సాధ్యపడలేదు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాతి సంవత్సరం 1948లో బీఎం బిర్లా (బసంత్కుమార్ బిర్లా) వెస్ట్ బెంగాల్ ఉత్తరపారలో చిన్న కార్ల తయారీ ఫ్లాంట్ను ప్రారంభించారు. అందులో ఐకానిక్ కార్లు మోరిస్ 10ను హిందుస్థాన్ 10లను తయారు చేసి మార్కెట్లో విడుదల చేశారు.
మోరీస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ 3 రైట్స్ హిందుస్తాన్దే..
1950 సంవత్సరం మధ్య కాలంలో హిందుస్తాన్ మోటార్స్ అధినేత బీఎం బిర్లా భారత్ మార్కెట్లో అంబాసిడర్ బ్రాండ్ కార్లను అప్గ్రేడ్ చేసి మార్కెట్లోకి విడుదల చేయాలని అనుకున్నారు. తొలుత మోరిస్ ఆక్స్ ఫర్డ్ సిరీస్ 2 కారు ఆధారంగా హిందుస్తాన్ ల్యాండ్ మాస్టర్ను తయారు చేశారు. తర్వాతి కాలంలో మోరీస్ ఆక్స్ ఫర్డ్ సిరీస్ 3 హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఈ కారు ప్రేరణతో అంబాసిడర్ తయారీకి పూనుకున్నారు. అలా మొదట్లో అంబాసిడర్ కారు సైడ్ వాల్వ్ ఇంజిన్తో వచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా, కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్లు అదే కారును ఓవర్హెడ్ వాల్వ్ ఇంజిన్గా తీర్చిదిద్దారు. ఇన్నోవేటివ్గా, యజమానులకు ఈజీగా ఉండేందుకు కారును మోనోకోక్ మోడల్గా మార్చారు.
సర్కారీ గాడీ
బిర్లా కుటుంబంపై పొలిటికల్ ఇన్లూ్ఫ్లయన్స్ ఎక్కువగా ఉండేది. అందుకే స్వదేశీ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రోత్సహించేలా 1954 నాటి ప్రభుత్వ విధానాల్ని అనుసరించి తయారు చేసిన కార్లలో అంబాసిడర్ సర్కారీ గాడీగా గుర్తింపు పొందింది. కాంపిటీటర్ కార్లతో పోలిస్తే అంబాసిడర్ కార్ల వేరియంట్లు ప్రీమియర్ పద్మిని, స్టాండర్డ్10 కార్ల పరిమాణం విశాలంగా, రఫ్గా ఉండటంతో ఇండియన్ రోడ్ల రారాజుగా దశాబ్దాలపాటు మార్కెట్లో ఆధిపత్యం చెలాయించింది. ఈ కార్లను ప్రభుత్వ కార్యాలయాల్లో విరివిరిగా వినియోగించేవారు. రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు, సంపన్నులు ఉపయోగించడంతో మార్కెట్ను శాసించింది.
Ambassador
2014లో నిలిపివేత..
అంబాసిడర్ కారు ఐకానిక్ కారు స్టేటస్ సింబల్గా మారింది. దశాబ్దాలుగా అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. కానీ 1980ల ప్రారంభంలో కాస్ట్ ఎక్కువ, మైలేజ్ తక్కువ కావడంతో పాటు, నాసికరంగా అంబాసిడర్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో వాటి అమ్మకాలు తగ్గిపోయాయి. అదే సమయంలో మారుతీ 800 లాంటి మోడల్స్ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి. ధర తక్కువ కావడం, మైలేజ్, ట్రెండ్కు తగ్గట్లు మోడళ్లు మార్కెట్లోకి రావడంతో అంబాసిడర్ కారుకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. 1980 నుంచి సంవత్సరానికి 20 వేల కార్లు అమ్ముడుపోగా.. రాను రాను ఆసేల్స్ 2 వేలకు పడిపోయాయి. దీంతో 57 ఏళ్ల పాటు మార్కెట్లో అందుబాటులో ఉన్న అంబాసిడర్ కారు తయారీని హిందుస్తాన్ ఆటోమొబైల్ సంస్థ 2014లో నిలిపివేసింది. 2017లో అంబాసిడర్ కారు మ్యాని ఫ్యాక్చరింగ్ హక్కుల్ని రూ.80 కోట్లకు ఫ్రెంచ్ కార్ మేకర్ పుజోకి అమ్మేసింది.
రీ ఎంట్రీ అదిరిపోయేలా…
అయితే ఇప్పుడు మళ్లీ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో చక్రం తిప్పేందుకు సిద్ధమైంది. అంబాసిడర్ ఎలక్ట్రిక్ కారుతో రీ ఎంట్రీ అదిరిపోయేలా ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఈ సందర్భంగా హిందుస్తాన్ మోటార్స్ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ ‘అప్పట్లో మా ఉద్యోగుల సంఖ్య 2,300 గా ఉండేది. ఇప్పుడు 300కి తగ్గింది. ప్రస్తుతం ఆర్ధిక సమస్యల నుంచి బయట పడ్డాం. ఇప్పుడు అంబాడిడర్ పేరుతో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని అనుకున్నాం. ఇందుకోసం చైనీస్ ఈవీ సంస్థల్ని సంప్రదించాం. కానీ యూరోపియన్ కంపెనీలతో జతకట్టాలని నిర్ణయించుకున్నాం. రూ.600కోట్ల పెట్టుబడితో ఫ్రెంచ్ కార్ మేకర్ పుజోతో కలిసి అంబాసిడర్ ఎలక్ట్రిక్ కార్ తయారు చేయబోతున్నట్లు’ ఉత్తమ్ బోస్ వెల్లడించారు.
Also Read:Revanth Reddy- KCR: ఆడబిడ్డల పుస్తెలతాడు.. కేసీఆర్.. ఓ వడ్డీ కథ చెప్పిన రేవంత్ రెడ్డి..