టీమిండియా క్రికెట్ చరిత్రలోనే ఎంఎస్ ధోని ఒక విజయవంతమైన కెప్టెన్ గా నిలిచిపోయారు. అతడి సారథ్యంలో ప్రపంచకప్ తోపాటు చాంపియన్స్ ట్రోపీ, టీ20 వరల్డ్ కప్, టెస్టు చాంపియన్ షిప్ సాధించారు. అయితే ఇంతటి విజయవంతమైన కెప్టెన్ తన ఆటతీరు మందగించిన వేళ విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ అప్పగించి అంతే హుందాగా వైదొలగడం సంచలనమైంది. ధోనిలోని గొప్పతనానికి అది నిదర్శనంగా నిలిచింది.
అయితే ధోని ఎంతో మంది యువ ఆటగాళ్లను స్టార్లుగా మలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించేలా తీర్చిదిద్దాడు. ధోని సారథ్యంలోనే యువరాజ్, విరాట్ కోహ్లీ, రైనా, రోహిత్ సహా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు.
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేముందు క్వారంటైన్ లో ఉన్న విరాట్ కోహ్లీ తాజాగా రవిచంద్రన్ అశ్విన్ తో ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా అశ్విన్ ఒక సూటి ప్రశ్నను విరాట్ కోహ్లీని అడిగారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పట్ల ఉన్న అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా కోహ్లీని కోరాడు అశ్విన్.
ఈ సందర్భంగా కోహ్లీ తన మనసులో మాటను బయటపెట్టాడు. ‘ధోని అంటే తనకు నమ్మకం. గౌరవం’ ఉన్నాయని రెండు ముక్కల్లో తేల్చేశాడు కోహ్లీ.రె టీమిండియాకు ఎంపికైన తొలి రోజుల్లో తనను ప్రోత్సహించాడని గుర్తు చేసుకున్నాడు. ధోని నుంచి కెప్టెన్సీని స్వీకరించడం తనకు అతిపెద్ద బాధ్యతగా భావిస్తున్నానని.. దాన్ని నిలబెట్టుకోవడానికి శ్రమిస్తున్నానని చెప్పాడు. తన ఆటతీరు పట్ల ధోనికి విశ్వాసం ఉండేదని.. తాను క్రీజులో ఉన్నాననే ఆత్మవిశ్వాసంతో ఉండేవాడని చెప్పుకొచ్చాడు.