Vaibhav Suryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian premier league) లో భీకరమైన బ్యాటింగ్ తో ఆశేషమైన అభిమానులను సంపాదించుకొని.. ప్రేక్షకుల బలాన్ని సొంతం చేసుకొని దూసుకుపోతున్నాడు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan royals) ఆటగాడు వైభవ్ సూర్య వంశీ (Vaibhav Surya vamshi). బెంగళూరు (RCB vs RR) తో శుక్రవారం రాత్రి గౌహతి(Guwahati cricket stadium) వేదికగా జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్య వంశీ బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. బౌలర్ ఎవరనేది చూడలేదు. బంతి ఎలా పడినా పట్టించుకోలేదు. స్టాండ్స్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకొని అతడు బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో వైభవ్ 26 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 7 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి.. ప్రారంభం నుంచి ఔట్ అయ్యేవరకు వైభవ్ ఒకే రీతిలో బ్యాటింగ్ చేశాడు. జైస్వాల్ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. సూర్య వంశీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. హేజిల్ వుడ్ నుంచి మొదలు పెడితే డేవిడ్ వరకు ఏ బౌలర్ ని కూడా అతడు వదిలిపెట్టలేదు.. తనకు 15 సంవత్సరాల వయసు అనే విషయాన్ని పూర్తి అతడు మర్చిపోయాడు. పక్కా ప్రొఫెషనల్ ఆటగాడిగా బ్యాటింగ్ చేశాడు. బెంగళూరు పై సాధించిన విజయంలో సూర్య వంశీ కీలక పాత్ర పోషించాడు.
వైభవ్ ఇప్పుడు మాత్రమే కాకుండా అండర్ 19 వరల్డ్ కప్ లో కూడా సత్తా చూపించాడు. టీమిండియా ట్రోఫీ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. సూర్య వంశీ స్థిరంగా ఆడుతున్న నేపథ్యంలో.. అతడికి త్వరలో జాతీయ జట్టులో చోటు లభించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బీసీసీఐ పెద్దలు అనధికారికంగా సంకేతాలు ఇచ్చినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే కనక జరిగితే అత్యంత చిన్నప్రాయంలో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు సూర్య వంశీ.
బలమైన రిస్ట్ హ్యాండ్ షాట్ లు ఆడటంలో సూర్య వంశీ తన ప్రతిభను చూపిస్తున్నాడు. ఒకప్పుడు వేగంగా ఆడే క్రమంలో వికెట్ కోల్పోయేవాడు. కానీ గత మూడు మ్యాచ్ లలో అతడి స్థిరత్వం కనిపిస్తోంది. టెక్నిక్ కనిపిస్తోంది. అందువల్లే మేనేజ్మెంట్ అతడికి జాతీయ జట్టులో చోటు కల్పించబోతోందని వార్తలు వస్తున్నాయి. జూన్ లో జరిగే ఆఫ్గనిస్తాన్ సిరీస్ కోసం అతడు ఆడతాడని.. జాతీయ జట్టులో మెరుస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మరి కొద్ది రోజుల్లో అధికారికంగా స్పష్టత వస్తుందని తెలుస్తోంది.