
Tokyo Paralympics: ఒలింపిక్స్ లో పలు పథకాలతో గతాన్ని మరిపించిన భారత క్రీడాకారులు.. ఇప్పుడు పారా ఒలింపిక్స్ (Paralympics) లోనూ సత్తా చాటుతున్నారు. సోమవారం ఒక్క రోజే ఐదు పతకాలు సాధించి దుమ్ము లేపారు. ఇందులో రెండు బంగారు పతకాలతోపాటు రెండు రజతాలు, ఒక కాంస్య పతకాలు ఉన్నాయి. జావెలెన్ త్రోలో మరో స్వర్ణ పతకాన్ని సుమిత్ భారత్ కు అందించాడు.
పారా ఒలింపిక్స్ లో సోమవారం భారత్ కు మరో స్వర్ణ పతకం లభించింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-64 విభాగంలో సుమిత్ అంటిల్ (Sumith Antil) మూడు సార్లు ప్రపంచ రికార్డ్ నెలకొల్పి సత్తా చాటాడు. భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ వేదికగా ఎగురవేశాడు.
సుమిత్ అంటిల్ తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్లతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. అతడు తర్వాత రెండో ప్రయత్నంలోనూ తన రికార్డును తానే తిరగరాశాడు. ఈసారి 68.08 మీటర్లు విసిరాడు. ఇక ఐదో ప్రయత్నంలో మరింత వేగంతో ఈటెను విసరగా.. అది ఈసారి ఏకంగా 68.55 మీటర్లు దూసుకుపోవడంతో కొత్త చరిత్రను సృష్టించింది.
దీంతో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం లేకుండా సుమిత్ భారత్ కు స్వర్ణం తెచ్చి పెట్టాడు. ఈక్రమంలోనే భారత్ కు ఒకే రోజు ఏకంగా ఐదు పతకాలు లభించాయి. ఇది రెండో స్వర్ణం కావడం గమనార్హం.
ఈ ఉదయం భారత్ కు స్వర్ణ పథకాన్ని అవనీ అందించింది. షూటింగ్ విభాగంలో క్రీడాకారిణి అవనీ లేఖరా చరిత్ర సృష్టించింది. మహిళల ఆర్-2 విభాగంలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్1 పోటీల్లో ఏకంగా స్వర్ణ పతకం సాధించింది సత్తా చాటింది. 249.6 పాయింట్లు సాధించి, తన గురికి తిరుగులేదని చాటి చెప్పింది అవని. ఈ ఫీట్ ద్వారా.. ప్రపంచ రికార్డును సమం చేసిందీ భారత క్రీడాకారిణి. పారా లింపిక్స్ లో స్వర్ణం సాధించిన భారత నాలుగో అథ్లెట్ గా నిలిచించింది అవని. ప్రస్తుతం ఈ క్రీడాకారిణి వయసు కేవలం 19 సంవత్సరాలే కావడం విశేషం.