Homeక్రీడలుసన్ రైజర్స్ గెలవాలంటే ఇవి చేయాల్సిందే?

సన్ రైజర్స్ గెలవాలంటే ఇవి చేయాల్సిందే?


ఎన్నో ఆశలతో ఐపీఎల్‌ 2020 సీజన్‌లోకి అడుగుపెట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీం డీలా పడిపోయింది. మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించలేకపోతోంది. చేజేతులారా మ్యాచ్‌లను సమర్పించేసుకుంటోంది. ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడితే కేవలం మూడు విజయాలతోనే సరిపెట్టుకుంది. మిగితా ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. చెన్నై, ఢిల్లీ, పంజాబ్‌ జట్లపై గెలుపొందగా.. రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌‌ కింగ్స్‌.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో వరుసగా ఓడిపోయింది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచే అవకాశం ఉన్నా.. వికెట్లు పారేసుకొని ఓటమిని చవిచూసింది.

ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. సన్‌రైజర్స్‌కు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకమైంది. ఇందులో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లో కనుక గెలిచి ఉంటే సన్‌రైజర్స్, కోల్‌కతా ఖాతాలో చెరో 8 పాయింట్లు ఉండేవి. మెరుగైన రన్ రేట్ కారణంగా ఆరెంజ్ ఆర్మీ టాప్-4లోకి చేరడంతోపాటు.. ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉండేవి. మరో మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా.. లీగ్ దశ ముగిసే నాటికి నెట్ రన్ రేట్ తేడాతో టాప్-4లోనే నిలిచేది. కానీ కోల్‌కతాతో మ్యాచ్‌ను గెలుపుతో ముగించకపోగా.. సూపర్‌‌ ఓవర్‌‌ ఆడాల్సిన దుస్థితి తెచ్చుకుంది.

ఆరెంజ్ ఆర్మీ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఇప్పటికీ ఉన్నా.. ఇకపై ఆడబోయే 5 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. కోల్‌కతా, పంజాబ్, రాజస్థాన్ జట్ల గెలుపోటములు కూడా సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేస్తాయి. రన్ రేట్ మెరుగ్గా ఉండటం ఒక్కటే ప్రస్తుతానికి ఆరెంజ్ ఆర్మీకి ఊరటనిచ్చే అంశం.

సన్‌రైజర్స్ తర్వాతి మ్యాచ్‌ల్లో రాజస్థాన్ (అక్టోబర్ 22), పంజాబ్ (అక్టోబర్ 24), ఢిల్లీ (అక్టోబర్ 27), బెంగళూరు (అక్టోబర్ 31), ముంబై (నవంబర్ 3) జట్లతో తలపడనుంది. చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ.. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జట్లతో సన్‌రైజర్స్ తలపడాల్సి వస్తోంది. నిన్నటి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఓడినా.. బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన మార్పులు ఆసక్తికరంగా ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇలాంటి మార్పులే చేస్తే ఫలితం ఉంటుందనే చెప్పాలి. ఫీల్డింగ్‌లో చక్కటి క్యాచ్‌లు అందుకుంటున్న ప్రియమ్ గార్గ్.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మినహా మిగతా మ్యాచ్‌ల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. మనీష్ పాండే సైతం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. వీరి స్థానాల్లో విరాట్ సింగ్, అభిషేక్ శర్మలను ఆడించాలనే డిమాండ్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది.

యువ హిట్టర్ విరాట్ సింగ్‌ను సన్‌రైజర్స్ రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌లోనూ అతడిని ఆడించలేదు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 106 రన్స్ మాత్రమే చేసిన ప్రియమ్ గార్గ్‌ను జట్టు ప్రయోజనాల కోణంలో ఇకనైనా పక్కనబెట్టాలి. గాయపడిన విలియమ్సన్ తదుపరి మ్యాచ్‌లకు దూరమైతే.. టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీకి తుది జట్టులో చోటు కల్పించాలి. భువీ లేకపోవడంతో.. బౌలింగ్‌లో సైతం పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. బెసిల్ థంపీ స్థానంలో ఆంధ్రా బౌలర్ పృథ్వీ రాజ్ యర్రాకు అవకాశం ఇవ్వాలి. అలా చేస్తేనే జట్టు ప్లేఆఫ్‌ ఆశలు సజీవం అవుతాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular