Team India Next Goals After T20 WC: ఈ జట్టుకు సాధ్యం కాని విధంగా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. టి20 వరల్డ్ కప్ ను వరుసగా రెండుసార్లు గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టి20 వరల్డ్ కప్ ఫార్మాట్ లో మూడుసార్లు ట్రోఫీలు అందుకొని.. మిగతా జట్లకు అందనంత ఎత్తులో నిలిచింది టీం ఇండియా.
Also Read: గూగుల్ డేటా సెంటర్పై జగన్ కి ఎందుకంత కడుపుమంట?
టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇప్పుడు అనేక విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. అందులో ప్రముఖమైనది టీమిండియా తదుపరి లక్ష్యాలు ఏంటనేది.. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా మీద అంచనాలు పెరిగిపోయాయి. అందులో మొదటిది వన్డే వరల్డ్ కప్. స్వదేశంలో 2023లో వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఆ టోర్నీలో టీమిండియా ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ దాకా వెళ్ళింది. బలమైన అన్ని జట్లను ఓడించింది. ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో యావత్ దేశం మొత్తం కన్నీటి పర్యంతమైంది. ఈ క్రమంలో తదుపరి వన్డే వరల్డ్ కప్ సాధించాల్సిన బాధ్యత టీమిండియా ప్లేయర్ల మీద పడింది. ఎందుకంటే 2011 తర్వాత టీమిండియా ఇంతవరకు మరోసారి వన్డే వరల్డ్ కప్ అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు వన్డే వరల్డ్ కప్ ను లక్ష్యంగా పెట్టుకొని తమ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
వన్డే వరల్డ్ కప్ తర్వాత.. భారత జట్టు దృష్టిసారించాల్సిన మరో కీలక విషయం కూడా ఉంది. అదే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ. ఈ విభాగంలో టీమిండియా రెండుసార్లు ఫైనల్ వెళ్ళింది. ఒకసారి న్యూజిలాండ్ చేతిలో.. మరొకసారి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇక గత సీజన్లో అయితే టీమిండియా దారుణంగా ఆడడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ దాకా వెళ్లలేకపోయింది. టెస్ట్ ఫార్మేట్లో టీమ్ ఇండియా ఆడుతున్న తీరు దారుణంగా ఉంది. న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్.. దక్షిణాఫ్రికా చేతిలో దారుణమైన పరాభవం.. అంతకుముందు ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి.. ఇవన్నీ కూడా టీమిండియా టెస్ట్ క్రికెట్ గతిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు తమ టెస్ట్ క్రికెట్ నైపుణ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కంటే.. ఆటగాళ్లు మైదానంలో సమయమనంతో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. వేగవంతమైన ఆట తీరును కాకుండా.. సమయోచితమైన తీరుతో ఆడాల్సి ఉంది. మైదానంలో తీవ్రంగా కసరత్తు చేస్తేనే ఆటగాళ్లు తమ క్రికెట్ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే గౌతమ్ గంభీర్ వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ మీద దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఆటగాళ్లతో కూడా ఇవే విషయాల గురించి చర్చించినట్టు సమాచారం. త్వరలోనే ఈ రెండు మేజర్ టోర్నీలను గెలుచుకోవడానికి అమలు చేయాల్సిన ప్రణాళికలపై మేనేజ్మెంట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.