YSR Congress criticism Google Project: ఏపీకి ( Andhra Pradesh) భారీగా పెట్టుబడులు తరలివస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులపై స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో పెట్టుబడులు రాకపోగా.. ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టారన్న ఆరోపణలు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై వినిపించాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో పారిశ్రామికవేత్తలను భయపెట్టారన్న అపవాదు ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రం కూడా అదే. అయితే కూటమి వచ్చిన 20 నెలల్లో పారిశ్రామిక ప్రగతి బాగానే కనిపించింది. పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు విశాఖకు తరలి వచ్చాయి. తయారీ రంగ పరిశ్రమలు రాయలసీమలో ఏర్పాటు అవుతున్నాయి. ఒక విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది మింగుడు పడని విషయం. పరిశ్రమల విషయంలో ప్రజల నుంచి సంతృప్తి కనిపిస్తోంది కూటమి ప్రభుత్వంపై. ఇటువంటి తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. పరిశ్రమల ఏర్పాటును ఆహ్వానిస్తూనే భూముల సేకరణ, పరిహారం చెల్లింపులు వంటి విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది. లేనిపోని వివాదాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై వస్తోంది.
Also Read: అధికారికంగా నేడు ప్రారంభం కానున్న ‘అల్లు సినిమాస్’, కానీ మూవీ చూడాలంటే… అప్పటివరకు ఆగాల్సిందే!
* హైకోర్టు అసహనం..
తాజాగా విశాఖ గూగుల్ డేటా సెంటర్( Google data centre) ఏర్పాటు, భూ సేకరణ పై వైసీపీ ఎంపీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. భూ సేకరణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీనిపై కలుగజేసుకునేందుకు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పిటిషనర్ గురుమూర్తి పై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్న సమయంలో ఇలా వివాదాలు సృష్టించడం సరికాదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. భూసేకరణలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు చూపగలరా అంటూ ప్రశ్నించినట్లు కూడా సమాచారం. రాజకీయ ఉద్దేశంతోనే ఇలాంటి ఫిర్యాదు చేసినట్లు కోర్టు అభిప్రాయ పడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
* ఆది నుంచి ఇవే తప్పిదాలు..
ఆది నుంచి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ వింత వాదనలు వినిపిస్తూనే ఉంది. ఈ డేటా సెంటర్తో ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండవని.. విశాఖ నగరంలో భూగర్భ జలాలు అడుగంటి పోతాయని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి స్పందించారు. గూగుల్ డేటా సెంటర్ రాకను ఆహ్వానించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరిచారు. అయితే విశాఖ గూగుల్ డేటా సెంటర్ రావడానికి వైసిపి ప్రభుత్వమే కారణమని చెప్పుకొచ్చారు. అప్పట్లో అదాని కంపెనీ, సింగపూర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, వైసిపి ప్రభుత్వం సంయుక్తంగా అదాని డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు వేసాయని.. ఇప్పుడు ఆదానితో గూగుల్ కంపెనీ చేసుకున్న ఒప్పందం ఫలితంగానే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అదంతా వైసిపి ప్రభుత్వ ఖాతాలో వేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కు భూముల కేటాయింపు పై విమర్శలు చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ బదులు అదాని కంపెనీకి ఎలా భూములు కేటాయించారంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో అదానితో ఒప్పందం వల్లే గూగుల్ వచ్చిందని చెప్పారు. ఇప్పుడు అదే గూగుల్ అనుబంధ పరిశ్రమకు భూములు కేటాయిస్తే తప్పుపడుతున్నారు.
* డేటా పాలసీ మార్పుతో..
వాస్తవానికి గూగుల్ డేటా సెంటర్ కోసం దేశంలో చాలా రాష్ట్రాలు ప్రయత్నాలు చేశాయి. కానీ డేటా పాలసీలో ( data policy )ఉన్న నిబంధనలతో ఆ రాష్ట్రాలకు సాధ్యం కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. డేటా పాలసీలో మార్పులు చేయాలని కోరారు. అలా ఆ మార్పులు చేసి కొన్ని నిబంధనలు మార్చారు. గూగుల్ కంపెనీకి కొన్ని రకాల రాయితీలు ఇచ్చారు. అన్ని రకాల భరోసా ఇవ్వడంతోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుకు సమ్మతించింది. అయితే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అయితే విశాఖ ఐటీ హబ్ గా మారుతుంది. పెద్ద ఎత్తున ఐటీ అనుబంధ పరిశ్రమలు తరలివస్తాయి. వచ్చే పదేళ్లలో లక్షలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి విశాఖలో. ఇప్పటికే సైబరాబాద్ విషయంలో చంద్రబాబు పేరు మార్మోగుతుంది. ఇప్పుడు కూడా అటువంటి క్రెడిట్ చంద్రబాబు ఖాతాలో పడుతుందని భావించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త వివాదానికి తెరతీసింది. అయితే అటు కోర్టులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇటు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అయితే తాజాగా గూగుల్ డేటా సెంటర్ కు వైసిపి అడ్డంకులను ప్రజల మధ్యకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రయత్నాల్లో ఉంది.