T20 World Cup IND vs PAK : స్ట్రాంగ్ టీమ్ సౌతాఫ్రికా నెదర్లాండ్స్ దెబ్బకి ఓడిపోయాక.. టి20 ల ఏమైనా జరగొచ్చు అని మరోసారి అర్థమైంది. ఈ లెక్కన చూస్తే ఇండియా, పాక్ ఫైనల్ లో తలపడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గ్రూప్ ఏ నుంచి ఇంగ్లండ్ న్యూజిలాండ్ సెమీస్ లో ఉన్నాయ్. బి నుంచి ఇండియా,. పాక్ ఉన్నాయి. సెమీస్ లో ఇంగ్లండ్ – కివీస్ కన్నా వేరియేషన్ ఇండో పాక్ టీముల్లోనే ఎక్కువ. కివీస్ కి బౌలింగ్ లో ఉన్న బలం బ్యాటింగ్ లో లేదు. ఇంగ్లండ్ బ్యాటింగ్ నే నమ్ముకుంటోంది. ఆసియా జట్లు ఇంగ్లిష్ బౌలింగ్ కి బాగా అలవాటు పడి ఉండటం ఇక్కడ కీ ! పాక్ లో టాపార్డర్ మోస్తరు. స్ట్రైక్ రేటు తక్కువ. బాబర్ రిథమ్ బాగా లేదు. బౌలింగ్ అగ్రెస్సివ్. ఇండియా బౌలింగ్ మోస్తరు అయినా డెప్త్ ఉన్న లైనప్ తో ఆడేస్తోంది. ఇదే అడ్వాంటేజ్.
ఈ లెక్కన, ఇండియా పాక్ ఫైనల్లో ఆడితే.. వారెవ్వా క్లాస్ ఎంటటైన్మెంట్ తో పాటు వేల కోట్ల వ్యాపారం కూడా ! ఆసియా కప్ లో ఆశ పడినా ఫైనల్ పడలేదు రెండు జట్లకీ ! వరల్డ్ స్టేజ్ లో అలాంటి అవకాశం కనపడుతోంది. ఆశించినవి జరక్కపోయినా కొన్నిసార్లు అనుకోనివి ఎదురొస్తాయ్ అంటే ఇదేనేమో!
సెమీస్ బెర్త్ లు ఖరారు
టి20 ప్రపంచకప్ లో సూపర్ 12 దశ ముగియడంతో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్_1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్, గ్రూప్ 2 నుంచి భారత్, పాకిస్తాన్ నాకౌట్ పోరుకు అర్హత సాధించాయి. గ్రూప్2 లో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో భారత్ బంగ్లాదేశ్ పై విజయం సాధించడంతో పాకిస్తాన్ సెమిస్ కు చేరాయి. దీంతో ఇప్పుడు క్రికెట్ ప్రేమికుల దృష్టి మొత్తం టీమిండియా, పాకిస్తాన్ పైనే పడింది. ఈ టి20 ప్రపంచ కప్ లో భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఒక మ్యాచ్ జరిగింది. అందులో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బుధవారం మొదటి మ్యాచ్
బుధవారం జరిగే తొలి సెమీఫైనల్స్ గ్రూప్ వన్ లో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో పాకిస్తాన్ అమీ తుమి తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ న్యూజిలాండ్ ను ఓడిస్తే ఫైనల్స్ కు చేరుకుంటుంది. గురువారం జరిగే రెండో సెమీస్ లో భారత్, ఇంగ్లాండ్ తలపడతాయి. ఈ పోరులో టీమిండియా ఇంగ్లాండ్ ని కనుక ఓడిస్తే ఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ పాకిస్తాన్ న్యూజిలాండ్ ను ఓడిస్తే భారత్ ఫైనల్ లో దాయాది జట్టుతో తలపడుతుంది. ఇలా ఘనక జరిగితే క్రికెట్ అభిమానులకు మరోసారి పసందైన వినోదం దక్కినట్టే.
2007 లోనూ ఇలాగే జరిగింది
2007 టీ 20 ప్రపంచ కప్ లో భారత్, పాకిస్తాన్ రెండుసార్లు తలపడ్డాయి. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ టై అయింది. బౌల్ అవుట్లో టీం ఇండియా విజయం సాధించింది. ఇక ఫైనల్ మ్యాచ్ కూడా ఈ రెండు జట్ల మధ్యే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. లక్ష్య చేదనలో పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 152 పరులు చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో భారత్ 5 పరుగుల తేడాతో గెలిచి తొలి టి20 టైటిల్ ఎగరేసుకుపోయింది. అయితే ఈసారి కూడా భారత్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్లో తలపడాలి అని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి ఫైనల్స్ కు ఏ జట్లు వెళ్తాయో!