IPL 2024: ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. ప్రేక్షకులకు అమితమైన క్రీడానందాన్ని అందజేస్తున్నది.. ఎంతో ఉత్సాహంగా సాగుతున్న మెగాటోర్నీ ప్లే ఆఫ్ దగ్గరికి వచ్చేసింది. 17వ సీజన్ లో మొత్తం 74 మ్యాచ్లకు.. ఇప్పటివరకు 55 మ్యాచ్లు జరిగాయి. సోమవారం రాత్రి ముంబై, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ ద్వారా ప్లే ఆఫ్ చేరే జట్ల పై ఒక అంచనా ఏర్పడింది.
పాయింట్ల పట్టిక పరంగా చూసుకుంటే.. శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలోని కోల్ కతా 16, సంజు శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ 16 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాజస్థాన్ ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. నెట్ రన్ తక్కువగా ఉండటంతో రాజస్థాన్ రెండవ స్థానానికి వెళ్లిపోయింది. కోల్ కతా లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ లో విజయాన్ని దక్కించుకొని మొదటి స్థానానికి చేరుకుంది. మూడు, నాలుగు స్థానాల కోసం మిగతా మూడు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ జట్లలో హైదరాబాద్, చెన్నై, లక్నో ఉన్నాయి.
ఈ మూడు జట్ల మధ్య ఆ రెండు స్థానాల కోసం హోరాహోరీగా పోరు కొనసాగుతోంది. ఈ మూడు జట్లు ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడాయి. ఆరు విజయాలు, 12 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ.. నెట్ రన్ రేట్ కీలకపాత్ర పోషిస్తున్నది.నెట్ రన్ రేట్ ప్రకారం చెన్నై జట్టు టాప్ స్థానంలో ఉంది. దాని తర్వాత హైదరాబాద్, ఆ తర్వాత లక్నో జట్లు ఉన్నాయి. ఈ మూడు జట్లు కూడా ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్లలో కనీసం రెండు మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
ఒకవేళ పాయింట్లు సమానంగా ఉంటే..రన్ రేట్ ఆధారంగా రెండు జట్లు ప్లే ఆఫ్ కు వెళ్తాయి. ఈ నేపథ్యంలో మిగతా మూడు మ్యాచ్లు ఆడే జట్లు.. కేవలం గెలుపుతోనే సరిపెట్టుకోకూడదు. రన్ రేట్ ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చెన్నై, హైదరాబాద్, లక్నో తర్వాతి స్థానాలలో ఢిల్లీ (10), పంజాబ్ (8), బెంగళూరు (8) జట్లు కూడా ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. వాస్తవానికి ఈ జట్లకు ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశం లేదు. అయితే హైదరాబాద్, చెన్నై, లక్నో జట్లు.. తాము ఆడాల్సిన మూడు మ్యాచ్లను వరుసగా ఓడిపోతే.. 12 పాయింట్లతోనే సరిపుచ్చుకుంటాయి. ఈ సమయంలో ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు ఆడాల్సిన మూడు మ్యాచ్లను.. వరుసగా గెలిస్తే.. అప్పుడు ఢిల్లీకి 16, బెంగళూరుకు 14, పంజాబ్ కు 14 పాయింట్లు లభిస్తాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా మెరుగ్గా ఉన్న రెండు జట్లు ప్లే ఆఫ్ వెళతాయి. ఐపీఎల్ అంటేనే సంచలనానికి మారుపేరు కాబట్టి.. ఏదైనా జరగొచ్చని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
ఇక ఈ 17వ సీజన్లో ప్రధానంగా ముంబై జట్టు గురించి చెప్పుకోవాలి. ఆ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. కానీ ఈ సీజన్లోనూ దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. 12 మ్యాచ్లకు నాలుగు గెలిచింది. 8 పాయింట్లతో.. 9వ స్థానానికి పడిపోయింది. అయితే ఈ టోర్నీ నుంచి ముంబై జట్టు ఇప్పటికే అనధికారికంగా ఎగ్జిట్ అయిపోయింది. గుజరాత్ జట్టు కూడా ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా వదిలేసుకుంది. ఆ జట్టు ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్లలో ఆ జట్టు భారీ విజయాలను అందుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే ఆ జట్టు అలా గెలిచే అవకాశాలు లేవనే చెప్పాలి.