India Vs South Africa Final: టి20 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. మరో మాటకు తావులేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మైదానంపై తేమ ఉన్న నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేయడంతో.. ప్రారంభ ఓవర్లలో భారత బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ 9, రిషబ్ పంత్ 0, సూర్య కుమార్ యాదవ్ 3 పరుగులకే అవుట్ కావడంతో, 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో టీమ్ ఇండియాను విరాట్ కోహ్లీ – అక్షర్ పటేల్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 72 పరుగులు జోడించారు. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ కూడా 47 పరుగులు చేశాడు. మూడు పరుగుల తేడాతో అర్ద సెంచరీ కోల్పోయినప్పటికీ.. ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసినప్పటికీ.. న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియంసన్ రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కేన్ విలియంసన్ చేసిన 85 పరుగులే ఇప్పటివరకు హైయెస్ట్ స్కోర్ గా ఉన్నాయి.
2021 లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియంసన్ 85 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2016లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ ఆటగాడు శామ్యూల్స్ 85 పరుగులు చేశాడు. 2012లో శ్రీలంక జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ ఆటగాడు శామ్యూల్స్ 78 పరుగులు చేశాడు. 2021 లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ 77 పరుగులు చేశాడు. 2024 లో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ 76 పరుగులు చేశాడు. 2007లో పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆటగాడు గౌతమ్ గంభీర్ 75 పరుగులు చేశాడు.