Homeక్రీడలుYashasvi Jaiswal: సిక్సుల మోత.. డబుల్ సెంచరీతో వాత.. యశస్వి బద్దలుకొట్టిన రికార్డులివీ

Yashasvi Jaiswal: సిక్సుల మోత.. డబుల్ సెంచరీతో వాత.. యశస్వి బద్దలుకొట్టిన రికార్డులివీ

Yashasvi Jaiswal: విశాఖపట్నంలో డబుల్ సెంచరీ సాధించాడు. రాజ్ కోట్ లో తొలి ఇన్నింగ్స్ లో 10 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇంకేముంది విశాఖపట్నంలో అది గాలివాటం డబుల్ సెంచరీ అని అందరూ అనుకున్నారు. కానీ వారందరికీ తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్. రెండవ ఇన్నింగ్స్ లో 30 పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయినప్పుడు.. వన్ డౌన్ బ్యాటర్ గా మైదానంలోకి వచ్చిన గిల్ తో కలిసి యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్ ను నిర్మించిన విధానం అత్యద్భుతం. శనివారం రెండవ ఇన్నింగ్స్ లో 104 పరుగులు చేసిన అతడు.. వెన్ను నొప్పితో బాధపడుతూ రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు.

ఆదివారం ఓవర్ నైట్ స్కోర్ 196/2 తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు.. మరో 50 పరుగులు చేసి వికెట్ కోల్పోయింది. వ్యక్తిగత స్కోరు 91 పరుగుల వద్ద ఉన్నప్పుడు కులదీప్ యాదవ్ చేసిన తప్పిదానికి గిల్ రన్ అవుట్ అయ్యాడు. గిల్ అవుట్ అయిన తర్వాత యశస్వి జైస్వాల్ మళ్ళీ మైదానంలోకి వచ్చాడు. కులదీప్ యాదవ్ తో కలిసి 12 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే దురదృష్టవశాత్తు కులదీప్ యాదవ్ రేహాన్ అహ్మద్ బౌలింగ్ లో రూట్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. అగ్నికి ఆజ్యం తోడైనట్టు జైస్వాల్ కు సర్ఫ రాజ్ జత కావడంతో ఇండియా స్కోరు రాకెట్ లాగా దూసుకుపోయింది.

శనివారం 104 స్కోర్ తో వెన్నునొప్పితో బాధపడుతూ రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగిన జైస్వాల్.. ఆదివారం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 12 ఫోర్లు, 7 సిక్స్ ల సహాయంతో లంచ్ విరామం తర్వాత 154 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లపై మరింత రెచ్చిపోయాడు. ఆడుతోంది టెస్టులు అనే విషయాన్ని మర్చిపోయి వన్డే తరహాలో చెలరేగిపోయాడు. ఫోర్లు కొట్టడం మానేసి సిక్సులు బాదాడు. డబుల్ సెంచరీ సాధించాడు. విశాఖపట్నం మైదానంలో డబుల్ సెంచరీ సాధించిన జైస్వాల్.. రాజ్ కోట్ లోనూ డబుల్ సెంచరీ సాధించాడు. 236 బంతుల్లో 214 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇందులో 14 ఫోర్లు, 12 సిక్స్ లు ఉన్నాయి. సర్ఫ రాజ్ తో కలిసి ఐదో వికెట్ కు 172 పరుగుల భాగస్వామ్యాన్ని జై స్వాల్ నెలకొల్పాడు. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ పై 557 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది.

-ఈ మ్యాచ్ లో రికార్డులు చూస్తే..

ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో పలు రికార్డులు నమోదయ్యాయి.. ఈ సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లు ఏకంగా 48 సిక్సర్లు బాదారు. ఒకే సిరీస్‌లో ఏ జట్టు అయినా చేసిన అత్యధిక సిక్సర్లు ఇవే కావడం విశేషం. 2019లో సౌతాఫ్రికాపై టీమిండియా 47 సిక్సులు బాదింది. ఇప్పటివరకూ ఇదే అత్యధికం. ఈ 3వ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 28 సిక్సర్లు బాదింది. 2019లో వైజాగ్‌లో సౌతాఫ్రికాపై 27 సిక్సర్లు ఇప్పటివరకూ ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్ల రికార్డుగా ఉండేది. ఒక టెస్టులో ఒక జట్టు చేసిన అత్యధిక సిక్సర్లుగా ఉండేవి. ఇప్పుడు ఈ రికార్డును ఇంగ్లండ్ పై తాజాగా టెస్టులో టీమిండియా అధిగమించడం విశేషం..

-అతిపిన్న వయస్కుడు కాంబ్లీ.. యశస్వికి 3వ స్థానం

టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా ఇప్పటివరకూ వినోద్ కాంబ్లీ ఉన్నాడు. 21 ఏళ్ల 54రోజుల్లో వినోద్ కాంబ్లీ ఈ డబుల్ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత 21ఏళ్ల 318 రోజుల్లో డాన్ బ్రాడ్‌మాన్ ఉన్నారు. ఆ తర్వాత తాజాగా 3వ టెస్టులో 22ఏళ్ల 49రోజులకు యశస్వి జైస్వాల్ ఈ ఘనత సాధించాడు. 22ఏళ్ల 173రోజుల్లో గ్రేమ్ స్మిత్ సాధించి 4వ స్థానంలో ఉన్నారు.

ఇలా ఒక మ్యాచ్ లోనే ఎన్నో రికార్డులను యశస్వి జైస్వాల్ నమోదు చేశాడు. సిక్సులు, పిన్న వయస్కుల రికార్డులను సాధించాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular