Homeక్రీడలుక్రికెట్‌Ind vs Pak : భారత్ తో ఓటమికి ముందే పాకిస్తాన్ పరువు పోయింది.. వీడియో...

Ind vs Pak : భారత్ తో ఓటమికి ముందే పాకిస్తాన్ పరువు పోయింది.. వీడియో వైరల్

Ind vs Pak : అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. ఈదశలో భారత్ తో జరిగే మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి పాకిస్తాన్ జట్టుది.. ఇందులో భాగంగానే ఆదివారం న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.. కెప్టెన్ నిర్ణయం సరైనదేనని చాటి చెబుతూ పాకిస్తాన్ బౌలర్లు భారత జట్టును 119 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. న్యూయార్క్ మైదానంపై ఈ స్కోర్ కఠినమైనదే అయినప్పటికీ.. పాకిస్తాన్ ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. 10 ఓవర్ల వరకు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 57 పరుగులు చేసి, కాస్త పటిష్టంగా కనిపించింది.. ఆ తర్వాత ఆ జట్టు టాప్ ఆర్డర్ ఒక్కసారిగా పేక మేడలా కూలిపోయింది. తక్కువ లక్ష్యాన్ని కూడా చేదించలేక.. ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. చివర్లో సింగిల్స్ కూడా ఇవ్వకుండా.. వెంట వెంటనే వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ జట్టు పరువును భారత బౌలర్లు నిలువునా తీసేసారు. దీనికంటే ముందు పాకిస్తాన్ తన పరువు పోగొట్టుకుంది. మ్యాచ్లో ఓటమి కంటే ముందే న్యూయార్క్ వేదికగా ఆ దేశం పరువును ఇమ్రాన్ ఖాన్ తీసి పడేశారు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నప్పటికీ.. ఆయన అనుచరులు చేసిన పని పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టింది.

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభం కంటే ముందు రెండు దేశాల జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగుతోంది.. ఈ సందర్భంగా మైదానం మీదుగా ఒక విమానం చక్కర్లు కొట్టింది. ఆ విమానం బయట నుంచి ” ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి” అనే ఇంగ్లీష్ అక్షరాలతో కూడి ఉన్న ఫ్లెక్సీ ని ప్రదర్శించారు. ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో ఈ వీడియోను ప్రదర్శించింది.. దీంతో ఒక్కసారిగా ఈ విషయం చర్చకు దారి తీసింది. 2018 నుంచి 2022 వరకు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ పనిచేశారు. ప్రస్తుతం ఆయన వయసు 71 సంవత్సరాలు. తోషాఖానా, సైఫర్, ఇస్లామిక్ వివాహ కేసుల ఆరోపణలతో పాకిస్తాన్ ప్రభుత్వం 2023 ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ ను జైలుకు పంపించింది. ప్రస్తుతం ఆయన ఆడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ గణనీయమైన సీట్లను సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఇమ్రాన్ ఖాన్ సందేశాలను రూపొందించిన పిటిఐ.. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీంతో ఆ పార్టీ గణనీయమైన సీట్లను సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్థాయిలో సీట్లను సాధించకపోవడంతో.. ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావలసి వచ్చింది. ఆయనను జైలు నుంచి విడుదల కాకుండా పాకిస్తాన్ ప్రభుత్వం కేసుల మీద కేసులు పెడుతోంది. ఆయన పార్టీకి చెందిన నాయకులను తీవ్రంగా హింసిస్తోంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒళ్ళు మండిన ఇమ్రాన్ ఖాన్ అనుచరులు.. విమానం మీదుగా ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి అనే పేరుతో ఉన్న ఫ్లెక్సీ ని ప్రదర్శించారు. గగనతలంలో తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఇక ఇమ్రాన్ ఖాన్ 1992లో పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.. ఆ జట్టుకు నాయకత్వం వహించాడు.. విమానం ద్వారా పీటిఐ నాయకులు ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయండి అనే అక్షరాలతో రూపొందించిన ఫ్లెక్సీని ఎగరేసి పాకిస్తాన్ లో నియంతృత్వం ఏ స్థాయిలో ఉందో బయటి ప్రపంచానికి తెలిసేలా చేశారు.. ఈ ఘటనతో పాకిస్తాన్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular