Eng Vs Nepal: టి20 వరల్డ్ కప్ లో అద్భుతం చోటు చేసుకునేదే. కేవలం నాలుగు పరుగుల దూరంలో అది ఆగిపోయింది. లేకుంటే ఈపాటికి నేపాల్ చేతిలో ఇంగ్లాండు ఇజ్జత్ మొత్తం పోయేది. అంతేకాదు, నేపాల్ క్రికెట్ జట్టు గురించి ప్రపంచం మొత్తం కథలు కథలుగా చెప్పుకునేది.
నిన్న జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 185 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో నేపాల్ జట్టు 20 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. నేపాల్ జట్టులో దీపేంద్ర సింగ్ (44), రోహిత్ పాడేల్ (39), లోకేష్ (39) సత్తా చూపించినప్పటికీ చివర్లో నేపాల్ జట్టు ఒత్తిడికి గురైంది. నాలుగు పరుగులు తీసే క్రమంలో తడబడింది. ఫలితంగా గెలుపు ముందు ఓడిపోయిన నేపాల్ జట్టు మనసులు గెలుచుకుంది. చివరి వరకు పోరాడి గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఊపిరి పీల్చుకుంది.
నేపాల్ జట్టుతో మ్యాచ్ అంటే అందరూ ఇంగ్లాండ్ గెలుస్తుందని ఒక అంచనాకొచ్చారు. ఇంగ్లాండ్ కూడా ముందుగా బ్యాటింగ్ చేసి ఏకంగా 184 పరుగులు చేయడంతో ఇంగ్లీష్ జట్టు గెలుపు ఖాయమని అందరూ నిర్ణయించుకున్నారు. కానీ ఆ తర్వాత నేపాల్ జట్టు తన అస్సలు సిసలైన టి20 గేమ్ మొదలుపెట్టింది. బ్యాటింగ్లో సత్తా చూపించింది. ఓపెనర్ లు కుషాల్ (29), ఆసిఫ్ షేక్ (7) అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ… రోహిత్, దీపేంద్ర సింగ్, లోకేష్ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు.
ఒక దశలో నేపాల్ జట్టు గెలుపు బాటలో ఉంది. ఆ సమయానికి నేపాల్ జట్టు స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 165 పరుగులుగా. ఆ క్రమంలో వుడ్ బౌలింగ్ వేస్తున్నాడు. ఆ ఓవర్ లో తొలి బంతి ఫోర్ వెళ్లిపోయింది. ఆ తర్వాతి రెండు బంతులను అతడు వైడ్ లు గా వేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ కోచ్ మెక్కులం వాకి టాకీలో మాట్లాడుతూ కనిపించాడు. అతడు ఇంగ్లాండ్ కెప్టెన్ తో మాట్లాడి ఉంటాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. గెలవడానికి ఇంగ్లాండ్ అనైతికానికి పాల్పడిందని.. కోచ్ అక్రమంగా ప్రవర్తించడాని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది సరైన విధానం కాదని.. ఇంగ్లాండ్ కోచ్ అలా వ్యవహరించడం తప్పని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ అని.. అందులో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని.. అలాకాకుండా గెలవడానికి అడ్డదారులు తొక్క కూడదని హితవు పలుకుతున్నారు. అతడు అలా మాట్లాడిన తర్వాత మ్యాచ్ స్వరూపం మారిపోయిందని.. పసికూన మీద గెలవడానికి ఇంగ్లాండ్ ఈ స్థాయిలో అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.