నిర్భయ దోషులకు ఉన్న న్యాయ అవకాశాలన్నీ ముగిసిపోయాయి. క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు పునరుద్ధరించాలన్న ముకేశ్ సింగ్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అతడికి న్యాయపరమైన ఏ అవకాశాలు లేవని పేర్కొంది. ప్రభుత్వాలు నేరపూరిత కుట్ర, మోసానికి పాల్పడి తనను తప్పుదోవ పట్టించారంటూ ముకేశ్ తన తాజా పిటిషన్లో ఆరోపించాడు. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, తన క్యురేటివ్, రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ ఆదేశాలను రద్దు చేయాలంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ ద్వారా కోర్టును ఆశ్రయించాడు. జస్టిస్లు అరుణ్ మిశ్రా, ఎంఆర్ షా ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. పిటిషన్ పరిశీలించదగినది కాదంటూ తిరస్కరించింది.
నిర్భయ దోషులు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) సోమవారం ఆశ్రయించారు. ఉరిశిక్షపై స్టే విధించాలని కోరారు. అయితే ఐసీజేలో వారికి ఊరట లభించడం కష్టమేనని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఐసీజే ఇలాంటి కేసుల్లో తలదూర్చదని అంటున్నారు. మరోవైపు ఐసీజే.. పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒప్పందం (ఐసీసీపీఆర్), సార్వత్రిక ఒప్పందం ఆధారంగా పని చేస్తుంది. ఆయా నిబంధనల ప్రకారం మరణ శిక్ష విధింపుపై ఎలాంటి నిషేధం లేదు.కానీ దోషి వయసు 18 ఏండ్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు, మానసిక పరిస్థితి సరిగా లేనప్పుడు, దోషి గర్భవతిగా ఉన్నప్పుడు మరణ శిక్ష విధించకూడదు. దోషికి ఉన్న న్యాయ విచారణ హక్కును పరిగణలోకి తీసుకోవాలి మొదలైన పరిమితుల మినహా ఐసీజే తలదూర్చదని అంటున్నారు న్యాయ నిపుణులు. అయితే నిర్భయ దోషుల విషయంలో ఈ నిబంధనలన్నింటినీ భారత ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పాటించిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి దోషులకున్న అన్ని అవకాశాలు అయిపోయాయి కాబట్టి మరణ శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.