Homeజాతీయ వార్తలుG.O. 111: ‘రియల్‌’ స్టోరీ: కేసీఆర్ ఎత్తేసే ‘111 జీవో’ వెనుక అసలు కథ.. లక్షల...

G.O. 111: ‘రియల్‌’ స్టోరీ: కేసీఆర్ ఎత్తేసే ‘111 జీవో’ వెనుక అసలు కథ.. లక్షల కోట్ల విలువైన భూమి!

GO 111: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మహా నగరానికి చేరువలో మరో భాగ్యనగరం పట్టేంత విస్తీర్ణంలో ఉన్న భూములు అవి. అలాంటి భూముల్లో వ్యవసాయేతర కార్యకలాపాలు చేపట్టడంపై ఆంక్షలు ఉన్నాయి. దీనికి 1996లో నాటి ప్రభుత్వం జారీ చేసిన జీవో 111 కారణం. ఆ జీవో ఏంటి? ఆ జీవోను కేసీఆర్ సర్కార్ ఎందుకు ఎత్తివేసింది. ఆ భూములను వ్యవసాయేతరంగా ఎందుకు మార్చింది? అంతటి విలువైన భూములను రియల్ ఎస్టేట్ గా మార్చి కోట్లకు పడగలెత్తేలా ఎందుకు చేస్తోందన్న దానిపై ‘రియల్’ స్టోరీ..

-111లోని ప్రధానాంశాలు:
మూసీ, ఈసీ నదుల జంట జలాశయాల పరిరక్షణ కోసం 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవో జారీ చేసింది. ఈ జీవో పరిధిలో 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాల భూమిని వ్యవసాయేతరులకు వాడవద్దని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం , భవన నిర్మాణాలు నిషేధించారు. ఇప్పుడా జీవోను ఎత్తేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనంత పనీ మొదలు పెట్టారు. తెలంగాణ సర్కారు 111 జీవోను ఉపసంహరించుకునే దిశగా అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ జీవోను ఎందుకు తీసుకొచ్చారు..? ఈ జీవో ఎత్తివేస్తే ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..? అనే విషయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

హైదరాబాద్‌ నగరానికి తాగు నీరు అందించేందుకు నిజాం పాలకుల హయాంలో జంట జలశయాలు ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్‌ను నిర్మించారు. కొన్నాళ్ల క్రితం వరకు ఈ జలాశయాలే హైదరాబాదీల తాగు నీటి అవసరాలను తీర్చేవి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ జలాశయాలకు నగరం విస్తరిస్తుండడంతో ముప్పు ఏర్పడుతుందని 1996లో నాటి ప్రభుత్వం గుర్తించింది. ఈ జలాశయాల్లోని నీరు కలుషితమైతే.. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందనే కారణంతో 111 జీవోను తీసుకొచ్చింది.

ఈ జీవో ప్రకారం.. జంట జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని బయో కన్జర్వేషన్‌ జోన్ గా ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన 84 గ్రామాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంత విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది దాదాపు జీహెచ్‌ఎంసీ విస్తీర్ణానికి సమానం. ఈ 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయేతర కార్యకలాపాలపై నిషేధం విధించారు. హైదరాబాద్‌ మహానగరానికి అత్యంత చేరువలో ఉన్న ఇంత పెద్ద మొత్తంలోని భూములను కేవలం వ్యవసాయ కార్యకలాపాలకే కేటాయించాలని ఆదేశించడంతో.. ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ సహా అనేక కార్యకలాపాలకు బ్రేక్‌ పడింది.

-కానీ నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు..
చాలా మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.. 111 జీవో పరిధిలోకి వచ్చే భూముల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ వందల సంఖ్యలో ఫామ్‌ హౌస్‌లు, విల్లాలు వెలిశాయి. తాము అధికారంలోకి వస్తే 111 జీవోను ఎత్తేస్తామని పార్టీలు హామీలు ఇవ్వడమే ఇందుకు కారణం. స్థానికులు సైతం ఈ జీవోను ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఎత్తేస్తుందా..? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ జీవోను ఎత్తేయాలని కోరుతూ చాలా మంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. కొంతమంది పర్యావరణవేత్తలు సైతం ఈ జీవోను ఎత్తివేయొద్దని కోరుతూ కోర్టు మెట్లెక్కారు.

-2016లో కమిటీ..
111 జీవోను ఎత్తివేసే విషయం తేల్చడం కోసం ప్రభుత్వం 2016లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఈ కమిటీ ఇంత వరకూ నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ కమిటీ నివేదికను సమర్పించాలని తెలంగాణ సర్కారును హైకోర్టు కోరినప్పటికీ.. కొంత గడువు కావాలని కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తాజాగా సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. 111 జీవో అర్థరహితం అని స్పష్టం చేశారు. ఈ జీవో పరిధిలో 1,32,600 ఎకరాల భూమి ఉందన్న ఆయన.. గతంలో జంట జలాశయాల పరిరక్షణ కోసం ఈ జీవో ఇచ్చారన్నారు. ‘హైదరాబాద్‌ నగర అవసరాలను తీర్చడం కోసం ఇప్పుడు గోదావరి, కృష్ణా నదుల నుంచి నీరు వస్తోందని.. మరో వందేళ్లు నగరానికి తాగునీటి కొరత ఉండదని.. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవోకు అర్థం లేదన్నారు. నిపుణుల కమిటీ నివేదిక రాగానే 111 జీవోను ఎత్తివేస్తాం’ అని సీఎం ప్రకటించారు.

-ఈ జీవో పరిధిలోకి వచ్చే గ్రామాలు..
అత్యధికంగా శంషాబాద్‌ మండల పరిధిలోని 47 గ్రామాలు, మొయినాబాద్‌ మండలంలోని 20 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. చేవెళ్ల పరిధిలోని 6 గ్రామాలు, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి మండలాల నుంచి 3 గ్రామాల చొప్పున, షాబాద్‌ మండలంలోని 2 గ్రామాలు, కొత్తూరు మండలంలోని ఒక గ్రామం 111 జీవో పరిధిలోకి వస్తాయి. ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తివేస్తాం అంటూ సీఎం ప్రకటించారు. దీంతో 111జీవో పరిధిలో ఉన్న భూములు ఇక బంగారం కానున్నాయి.

-జంట జలాశయాలుగా హైదరాబాదీలు పిలిచే ఈ రెండూ మానవ నిర్మితాలే..
1908 మూసీ వరదల తరువాత నిజాం రాజు అప్పటి ప్రఖ్యాత ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి, మూసీ నదిపై సమగ్ర నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ జలాశయాలు నిర్మించి వరద నీటిని నిల్వ చేస్తూనే, హైదరాబాద్‌ నగరానికి తాగు నీరు అందించే ఏర్పాటు చేశారు. దాదాపు వందేళ్ల నుంచీ ఈ జలాశయాలు హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు తీరుస్తూ వచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ ఎత్తివేసే జీవోతో హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఉన్న వందేళ్ల నాటి రెండు పెద్ద చెరువులు గండిపేట, హిమాయత్‌ సాగర్‌కు ముప్పు వాటిళ్లబోతుందా అంటే అవుననే అంటున్నారు పర్యావరణ వేత్తలు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular