Homeజాతీయ వార్తలుADR Report: 15,077.97 కోట్ల విరాళాలు తీసుకున్నాయి: ఏ పార్టీ సుద్దపూస కనుక

ADR Report: 15,077.97 కోట్ల విరాళాలు తీసుకున్నాయి: ఏ పార్టీ సుద్దపూస కనుక

ADR Report: శ్మ శానం ముందు ముగ్గు ఉండదు. రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు. రాజకీయాల్లో పెచ్చరిల్లిపోతున్న అవినీతి గురించి ఓ సినీ కవి రాసిన మాట ఇది. ప్రస్తుతం పరిస్థితులు అంతకంటే అధ్వానంగా ఉన్నాయి. పేరుకు సుద్దులు వల్లించే పార్టీలు, నాయకులు అనుసరించేది మొత్తం కూడా ద్వంద్వనీతే. కోట్లకు కోట్లు వెనుక వేయడం, తరాలకు సరిపోయేలా సంపాదించడం భారతదేశంలో పరిపాటిగా మారింది. స్విస్ బ్యాంకుల్లో నేతలు తమ బినామీ లతో మదుపు చేస్తున్న నగదు ప్రతి ఏటా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. ప్రతి విషయంలో పరస్పరం విమర్శించుకునే అధికార ప్రతిపక్ష పార్టీలు సంపాదన విషయంలో మాత్రం భాయీ, భాయీ! ఇందులో సందేహం లేదు.

ADR Report
ADR Report

₹15, 077. 97 కోట్ల విరాళాలు

భారతదేశంలోని జాతీయ పార్టీలు 2004 నుంచి 2021 వరకు వివరాలు వెల్లడించిన వ్యక్తులు, వివిధ సంస్థల ద్వారా ₹15,077.97 కోట్లను విరాళాల రూపంలో అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ నివేదిక తెలిపింది. ఇదే సమయంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు గుర్తు తెలియని వారి నుంచి ₹690.67 కోట్లను విరాళంగా స్వీకరించాయి. నివేదికలో బిజెపి, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి ఎనిమిది జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 2004 నుంచి 2021 వరకు ఎన్నికల సంఘానికి పార్టీలు సమర్పించిన విరాళాలు, ఆదాయపు పన్ను రిటర్న్ల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఎలాంటి వివరాలు ఇచ్చిన వ్యక్తులు సంస్థల నుంచి జాతీయ పార్టీలు సుమారు ₹15,077.97 కోట్లు విరాళంగా అందుకున్నట్టు తెలుస్తోంది. 2020_21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8 జాతీయ పార్టీలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ₹426. 74 కోట్లు అందుకోగా, 27 ప్రాంతీయ పార్టీలు ₹263. 928 కోట్లు విరాళంగా పొందాయి.

కాంగ్రెస్ హవా

2020-21 సంవత్సరానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ₹178.782 కోట్లను వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి పొందింది. అది మొత్తం జాతీయ పార్టీలు పొందిన దాంట్లో 41.89% మరోవైపు బిజెపికి ₹100.502 కోట్లు అందాయి. అది మొత్తం వివరాలు లేని వారి నుంచి అందిన దాంట్లో 23.55 శాతంగా ఉంది. మరోవైపు వివరాలు లేని వ్యక్తుల నుంచి ఎక్కువ మొత్తంలో అందుకున్న మొదటి ఐదు పార్టీలు ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ₹96.2507 కోట్లు, తమిళనాడులోని డిఎంకె ₹80.02 కోట్లు, బి జె డి ₹67 కోట్లు, ఎంఎన్ఎస్ ₹5 కోట్లు ఆప్ ₹5 కోట్లు పొందాయి.

ADR Report
ADR Report

ఎన్నికల సంఘం ఏం చేస్తోంది

దేశంలోని స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థల్లో ఎన్నికల సంఘం ఒకటి. జాతీయ, ప్రాంతీయ పార్టీల వ్యవహారాల మీద నిత్యం డేగ కన్ను వేసి ఉంచుతుంది. టిఎన్ శేషన్ ఎన్నికల సంఘం అధిపతిగా ఉన్నప్పుడు అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. విశేషమైన అధికారాలు ఎన్నికల సంఘానికి దక్కేలా చూసారు. అప్పట్లో ఎన్నికల సంఘం అంటే అన్ని రాజకీయ పార్టీలు వణికేవి. ఆయన తర్వాత వచ్చిన లింగ్డో కూడా ఎన్నికల సంఘం ప్రతిష్టను మరింత పెంచారు. కానీ కాలానుగుణంగా ఎన్నికల సంఘంలో కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి సంబంధించిన అనుకూలరైన వ్యక్తులే నియమితులు అవుతుండడంతో పరిస్థితి గాడి తప్పుతోంది. ముఖ్యంగా ఈ దుస్థితి కాంగ్రెస్ హయాం నుంచి మొదలైంది. ఫలితంగా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కోరలు లేని పామయ్యింది. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు లెక్కా పత్రం లేకుండా విరాళాలు స్వీకరిస్తుండటం వల్ల ప్రజాస్వామ్యం నానాటికి నగబాటుకు గురవుతోంది. పేదలకు ఉచితాల గురించి భారీ భారీ ఉపన్యాసాలు ఇచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంపై మాట్లాడకపోవడం గమనార్హం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular