Hyderabad Crime : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు. అలాగే దొంగలు ఎవరూ చూడటం లేదని దొంగతనం చేస్తే ఎప్పుడో ఒకరోజు దొరికిపోక తప్పదు. ఇప్పుడు ఈ సంఘటన కూడా పై ఉపోద్ఘాతం అలాగే ఉంది. దొంగలు ఎవరూ చూడటం లేదని దొంగతనం చేశారు. కానీ చివరికి దొరికిపోయారు.
హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ జాగిర్ వినాయక నగర్ ప్రాంతంలో యాదయ్య అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. 2023 సెప్టెంబర్ 16న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. 19 అతడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న రెండు లక్షల 50 వేల నగదు.. 9 తులాల బంగారం.. పది చీరలు చోరీకి గురయ్యాయి. దీంతో యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనేక రకాలుగా దర్యాప్తు చేసినప్పటికీ ఈ కేసులో పురోగతి కనిపించలేదు. దీంతో ఇక తన బంగారం.. నగదు.. భార్య చీరలు ఎప్పటికీ దొరకవని అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు. మదిలో ఆ దొంగతనం మెదిలినప్పుడల్లా యాదయ్య ఆవేదన చెందేవాడు. కన్నీటి పర్యంతమయ్యేవాడు.
ఇటీవల యాదయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఫంక్షన్ కి వెళ్ళాడు. అక్కడికి రాములు, స్వప్న అనే దంపతులు వచ్చారు. స్వప్న కట్టుకున్న చీరను యాదయ్య పదేపదే పరిశీలించాడు. ఆ చీర తన భార్యదని గుర్తించాడు. వెంటనే స్వప్నను నిలదీశాడు. యాదయ్య అలా అడగడంతో స్వప్న ముందు బుకాయించింది. ఆ తర్వాత యాదయ్య గట్టిగా నిలదీశాడు. దీంతో స్వప్న నిజం ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు స్వప్న.. రాముడు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారు దొంగతనం చేసిన బంగారం.. నగదు.. చీరలను రికవరీ చేయడం మొదలుపెట్టారు.
స్వప్న, రాములు దంపతులు యాదయ్య ఇంటి వెనక భాగంలో ఉంటారు. యాదయ్య ఇంట్లో ఉన్న వస్తువులు.. తాళాలు అన్ని స్వప్నకు తెలుసు. అందువల్లే వారు ఆస్పత్రికి వెళ్ళగా అతను చూసుకొని దొంగతనం చేసింది. ఆమెకు భర్త సహకరించాడు. అప్పుడు దొంగతనం జరిగినప్పుడు స్వప్న దంపతులు యాదయ్య దంపతులను పరామర్శించారు కూడా. కాని చివరికి స్వప్న దంపతులే దొంగతనం చేశారు అని తేలడంతో ఆ కాలనీవాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.. కష్టపడ్డ సమయం ఎప్పటికీ దూరం కాదు. అది ఏనాటికైనా కష్టపడ్డ వాళ్ళ దరికి చేరుతుంది. ఈ ఉదంతం దానిని నిరూపించింది.