దేశంలోని ప్రజలకు ప్రతి నెల 1వ తేదీన కొన్ని నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ ధరలు, బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించిన నిబంధనలలో కీలక మార్పులు జరుగుతున్నాయి. కొత్త నిబంధనల గురించి అవగాహన కలిగి ఉంటే అదనపు భారం గురించి తెలియడంతో పాటు ప్రజలకు అనవసర ఖర్చులను సులభంగా తగ్గించుకునే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు.
మార్చి నెల 1వ తేదీ నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గ్యాస్ ధరలను చమురు ధరల పెరుగుదలతో లింక్ చేయనుంది. దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాలు సైతం గ్యాస్ సిలిండర్ ను కలిగి ఉన్నాయి. ఇప్పటివరకు ప్రతి నెలా తొలి వారంలో గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకునేది కాగా ఇకపై చమురు ధరలను బట్టి గ్యాస్ ధరలలో మార్పులు ఉండనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ నిబంధనలలో కూడా మార్పులు ఉండనున్నాయి.
ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ సేవలు ఉచితంగా అందుబాటులో ఉండనుండగా రేపటినుంచి 100 రూపాయలు ఖర్చు చేసి ఫాస్టాగ్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ద్వారా రీఛార్జ్ చేయించుకోని వారు అదనంగా ఫైన్ ను చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఖాతాదారులకు సేవలు కొనసాగాలంటే కేవైసీ తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు కేవైసీ పూర్తి చేయని వారు కేవైసీ చేసుకుంటే యధాతథంగా ఎస్బీఐ సర్వీసులను పొందవచ్చు.
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లలో ఒకటైన హెచ్డీఎఫ్సీ పాత బ్యాంక్ యాప్ రేపటి నుంచి పని చేయదు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లు గూగుల్ ప్లేస్టోర్కు వెళ్లి ఉచితంగా కొత్త యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే యాప్ సర్వీసులను సులభంగా పొందవచ్చు. రేపటినుంచి లాటరీలపై 28 శాతం జీఎస్టీ అమలులోకి రావడంతో లాటరీలో మరింత ప్రియం కానున్నాయి. ఇండియన్ బ్యాంక్ మార్చి నెల 1వ తేదీ నుంచి బ్యాంక్ ఏటీఎంలలో 2,000 నోట్లు పెట్టవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లు ట్రాన్ ఎన్టీవో 2.0 రూల్స్ ను రేపటి నుంచి అమలు చేస్తున్నాయి. ఫలితంగా 200 ఫ్రీ ఎయిర్ టు ఛానెల్స్ తక్కువ ధరకే యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. మల్టీ టీవీ కనెక్షన్ కోసం తక్కువ ఛార్జీలు చెల్లించినా సరిపోతుంది.