Homeక్రీడలుIND Vs PAK: థ్రిల్లింగ్ చివరి ఓవర్.. పాకిస్తాన్ పై టీమిండియా గెలుపునకు అతడే కారణం

IND Vs PAK: థ్రిల్లింగ్ చివరి ఓవర్.. పాకిస్తాన్ పై టీమిండియా గెలుపునకు అతడే కారణం

IND Vs PAK: నిన్న పాకిస్తాన్ తో ఇండియా మ్యాచ్ చూస్తే అందరి గుండెలు జారిపోయాయి. మరోసారి పాక్ చేతిలో ఓటమి తప్పదా? అని అనుకున్నారు. చివరి థ్రిల్లింగ్ ఓవర్ వరకూ ఇండియా గెలుపుపై మైదానంలోని ప్రేక్షకులకు.. టీవీ చూస్తున్న భారతీయులకు నమ్మకం లేదు. టాస్ గెలవగానే సంబురపడ్డాం. పాకిస్తాన్ టాప్ ఆర్డర్ ను కూల్చేశామన్న సంబురం చివర్లో ఆవిరమైంది. పాకిస్తాన్ ను 120 లోపే కట్టడి చేద్దామనుకుంటే పాక్ చివరి వరుస బ్యాట్స్ మెన్ పోరాడడంతో 147 పరుగుల భారీ స్కోరు నమోదైంది. దుబాయ్ లాంటి పిచ్ పై 140 పరుగులు కూడా భారీ లక్ష్యమే. ఇంతటి లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే అపశకునం.. ఖాతా తెరవకుండానే కేఎల్ రాహుల్ డకౌట్. పరుగులు చేయడానికి రోహిత్ శర్మ తండ్లాడుతున్న పరిస్థితి. ఒక్కొక్కరుగా ఔట్ అవుతుంటే గుండె బరువెక్కుతోంది. చివరి ఓవర్ కు వచ్చేసరికి మైదానంలోని భారతీయ అభిమానులంతా సైలెన్స్.. గోళ్లు కొరుక్కుంటూ.. తల పట్టుకుంటూ ముభావంగా ఉన్నారు. మన ‘లైగర్’ రౌడీ హీరో విజయ్ దేవరకొండలోనూ టెన్షన్. తన సినిమా రిలీజ్ కు కూడా ఇంత టెన్షన్ అనుభవించి ఉండరేమో.. కానీ ఆ చివరి ఓవర్ మలుపుతిప్పాడు మన కుంగ్ ఫూ పాండ్యా.. నిజంగానే భారత్ ను గెలిపించాడు. పాకిస్తాన్ పై టీమిండియా గెలిచిందంటే అతడొక్కడే కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ పాండ్యా ఏం చేశాడు? ఎలా గెలిపించాడు?

బౌలింగ్ లో 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి ఏకంగా 3 కీలక పాక్ వికెట్లను పాండ్యా పడగొట్టాడు. గాయాలతో జట్టుకు దూరమై టీమిండియాలో చోటే కష్టం అనుకున్న పాండ్యా గత ఐపీఎల్ నిరూపించుకున్నారు. గుజరాత్ టైటాన్స్ కు కప్ నందించి సారథిగా 100కు 100 మార్కులు వేయించుకున్నాడు. అక్కడి నుంచి టీమిండియాకు ధోని తర్వాత బెస్ట్ ఫినిషర్ గా మారాడు. ప్రతీ మ్యాచ్ లోనూ ఆడుతూ గెలిపిస్తూ వస్తున్నాడు. ఐర్లాండ్ టూర్ కు కెప్టెన్ గా వెళ్లి సిరీస్ విజయాన్ని అందించాడు.

ఇప్పుడు పాకిస్తాన్ తో మ్యాచ్ లో అటు బౌలింగ్ లో.. ఇటు బ్యాటింగ్ లోనూ రాణించి టీమిండియాను గెలిపించాడు. పాక్ తో మ్యాచ్ అంటేనే భారీ ఒత్తిడి. వస్తున్న ఆటగాళ్లు అంతా కొట్టలేక సతమతమవుతుంటే హార్ధిక్ ముఖంలో ఏమాత్రం టెన్షన్ ఒత్తిడి కనిపించలేదంటే అతిశయోక్తి కాదు.ఒక ధీరుడిగా యుద్ధానికి వచ్చినట్టు వచ్చాడు. ఒకనొక సమయంలో భారత విజయానికి బంతులు తక్కువ.. చేయాల్సిన పరుగులు ఎక్కువ. ఉన్న ఒక్కడు గెలిపిస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ ఔట్ అయిపోయాడు. జడేజా బాగా ఆడుతున్నా వేగంగా పరుగులు చేయడం లేదు. దీంతో భారత్ లక్ష్యం కొండంతగా పెరిగింది.

కానీ అప్పుడొచ్చాడు హార్ధిక్ పాండ్యా.. జడేజా అండతో చెలరేగిపోయాడు. చివరి 27 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన దశలో వరుసగా ఫోర్లు, సిక్సర్లు కొట్టి 6 బంతుల్లో 7 పరుగులకు తీసుకొచ్చాడు. అయితే లాస్ట్ ఓవర్ తొలి బంతిలోనే జడేజా ఔట్ కావడంతో మళ్లీ ఆందోళన. తొలి మూడు బంతుల్లో వికెట్ పడి వచ్చింది ఒకపరుగే. 3 బంతుల్లో 6 కొట్టాలి. కానీ హార్ధిక్ పాండ్యా తర్వాత బంతిని సిక్స్ కొట్టి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. భారత అభిమానుల సంబరాలతో దుబాయ్ స్టేడియం తడిసిముద్దైంది. అప్పటివరకూ సైలెన్స్ గా రోదించిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఖచ్చితంగా పాక్ పై టీమిండియాను గెలిపించింది మన పాండ్యానే. అతడే భవిష్యత్ సారథి కావాలన్న డిమాండ్ ఈ మ్యాచ్ తర్వాత ఏక్కువైంది.

ఒకప్పటి ధోనిని మరిపిస్తున్నాడు. ధోనిలాగానే ఎమోషన్ ను కంట్రోల్ చేస్తున్నాడు. పరుగులు చేయడంలో అలాంటి పరిణతి కనబరుస్తున్నాడు. టైం చూసి గేర్ మారుస్తున్నాడు. ముఖ్యంగా ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ గా నిరూపించుకుంటున్నాడు. ధోని అలవాట్లున్న పాండ్యా ఖచ్చితంగా భవిష్యత్ టీమిండియా కెప్టెన్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. పాండ్యా ఆటతీరు, ఆత్మవిశ్వాసం చూసిన వారు ఎవరైనా సరే మరో ధోని వచ్చాడని కొనియాడుతున్నాడు. ఇతడే భారత క్రికెట్ భాగ్యరేఖను మారుస్తాడని అంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular