Homeజాతీయ వార్తలుDraupadi Murmu: పదవులిస్తున్నారు.. పవర్ నొక్కేస్తున్నారు.. ద్రౌపది ముర్ము ఎంపిక వెళ తెరపైకి ‘సామాజిక న్యాయం’

Draupadi Murmu: పదవులిస్తున్నారు.. పవర్ నొక్కేస్తున్నారు.. ద్రౌపది ముర్ము ఎంపిక వెళ తెరపైకి ‘సామాజిక న్యాయం’

Draupadi Murmu: ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎంపికయ్యారు. స్వాతంత్ర భారవతావనిలో తొలి గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఎంపిక కావడం నిజంగా గర్వించదగ్గ విషయం. శుభ పరిణామం. కానీ ఓ గిరిజన మహిళ అత్యున్నత పదవికి ఎంపిక కావడానికి దాదాపు ఏడు దశాబ్దాలు పట్టడం మాత్రం దురదృష్టకరం. ద్రౌపది ముర్ము గిరిజన మహిళ కావడంతోనే తాము మద్దతిస్తున్నట్టు చాలా పార్టీలు ప్రకటించాయి. అయితే అదంతా బయటకు చెప్పుకునేందుకు మాత్రమే. చాలా రాజకీయ పార్టీలు ఆమెకు మద్దతివ్వడం అనివార్యంగా మారింది. ముఖ్యంగా బీజేపీతో విభేదించే పార్టీలు సైతం ఆమెకు మద్దతు తెలిపాయి. బయటకు సామాజిక కోణమని చెబుతున్నా ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి. రాష్ట్రంలో కత్తులు దూసుకుంటున్న వైసీపీ, టీడీపీలు సైతం కూడా ఇప్పుడదే కారణం చూపుతూ ముర్ముకు మద్దతు తెలిపాయి. దేశంలో శివసేన, జనతాదళ్, జేఎంఎం పార్టీలు సైతం అనూహ్యంగా మద్దతు ప్రకటించాయి. ముర్ముకే ఓటు వేశాయి. బహుశా ఆమెను బరిలో దింపిన బీజేపీ పెద్దలు ఊహించనంతంగా మెజార్టీ రావడం వెనుక కథ ఇదే. తాము సామాజిక న్యాయం పాటిస్తున్నామని చెప్పడానికి, బడుగు, బలహీనవర్గాలు, నిమ్న జాతులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. పోనీ విపక్ష కూటమి అభ్యర్థికి ఓటు వేస్తామంటే గెలుపునకు కనుచూపు మేరలో లేకపోవడం కూడా ముర్ముకు గుంపగుత్తిగా ఓట్లు పడడానికి ఒక కారణం. అయితే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం మోదీ, షా ద్వయం వ్యూహం ఫలించింది. ఫలితంగా తమను వ్యతిరేకించే పార్టీలు సైతం తమ వెంట నడిచే బృహుత్తర ప్రణాళికలో బీజేపీ పెద్దలు సక్సెస్ అయ్యారు. ఫలితంగా సొంత పార్టీలో తమను విభేదించి, తమ స్థాయి నేతలను సైతం వెనక్కి పంపారు. వెంకయ్యనాయుడు వంటి వారి ఉనికి లేకుండా తమకు లైన్ క్లీయర్ చేసుకున్నారు. బీజేపీ లేనిదే తమ అవసరం తీరదన్న భావనకు దేశంలో మిగతా రాజకీయ పక్షాలు వచ్చేలా స్పష్టమైన సంకేతాలు పంపారు. మొత్తానికి అయితే ముర్ము ఎన్నికతో సామాజిక న్యాయమంటూ పాత అంశమే కొత్తగా తెరపైకి రావడం శుభ పరిణామం.

Draupadi Murmu
Draupadi Murmu

బీజేపీకి షాక్…
సామాజిక న్యాయమంటూ వల్లే వేసే పార్టీలకు.. తాము సొంత పార్టీ తరుపున పదవులు కట్టబెట్టిన వారికి ఏ స్థాయిలో ఉంచారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యూపీలో తమ సొంత శాఖల్లో వేలు పెడుతున్నారని.. తమను స్వతంత్రంగా వ్యవహరించే ఛాన్స్ ఇవ్వడం లేదని ఇద్దరు మంత్రులు రాజీనామా బాట పట్టడారు. కనీసం శాఖలో చిన్నపాటి అధికారులను ట్రాన్స్ ఫర్ ఇప్పించుకునే స్టేజ్ లో తాము లేకపోయామని ఆ ఇద్దరు మంత్రులు తెగ బాధపడిపోయారు. యోగి ఆదిత్యనాథ్ పైనే ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి పదవి పీఠం పై ముర్ము కూర్చునే వేళ.. సామాజిక న్యాయం చేశామని బీజేపీ పెద్దలు భావిస్తున్న తరుణంలో వెనుకబడిన తరగతులకు చెందిన ఇద్దరు మంత్రుల రాజీనామా… బీజేపీలో సామాజిక న్యాయాన్ని ప్రశ్నించింది. ఒక విధంగా చెప్పాలంటే సామాజిక న్యాయం అనేది ఒక ఆర్భాటపు ప్రకటన మాత్రమే. పదవులు, కొలువులు దక్కించుకున్న వెనుకబడిన తరగతుల వారి పరిస్థితి అందరికీ తెలిసిందే. వారి వద్ద అధికారం ఉండదు.. నిధులు ఇవ్వరు.. విధులు చేయనివ్వరు. దేశజనాభాలో వెనుకబడిన తరగతుల వారి సంఖ్యే అధికం. పాలకపక్షం వారి సంఖ్య అత్యల్పం. అయినా వారి మాటే నెగ్గుతోంది. కానీ సామాజిక న్యాయం చేశామంటూ కొత్త పల్లవి అందుకొని వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులను మాత్రం నోరు మూయిస్తున్నారు. విభజించు పాలించు అన్న చందంగా ఆ వర్గాల మధ్య వైరుడ్యాలను నింపి తాము మాత్రం దర్జాగా అధికారాన్ని వెలగబెడుతున్నారు.

Also Read: MP Raghu Rama Krishnam Raju: పార్లమెంట్ లో రఘురామ కితకితలు

ఆ మంత్రులకు అధికారమేదీ?
ఏపీలో అయితే వెనుకబడిన, అణగారిన వర్గాల ఆశాజ్యోతి అన్నట్టు జగన్ బిల్డప్ ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా 75 శాతం పదవులు కేటాయించామని ప్రకటించారు. అయితే ఇందులో వాస్తవం ఉంది. అటు పార్టీలో, ప్రభుత్వంలో మాత్రం గణనీయమైన పోస్టులు సృష్టించి మరీ బడుగులకు కట్టబెట్టారు. దీనికి అభినందనలు తెలపాల్సిందే. కానీ వారికి అధికారాలుండవు..నిధులుండవు..తమ పని తాము చేసుకోనివ్వరు. సీఎం పదవి తరువాత హోంశాఖే కీలకం. అటువంటి శాఖకు తానేటి వనితకు ఇప్పించారు.

Draupadi Murmu
Draupadi Murmu

కనీసం ఆమె హోంగార్డు ట్రాన్స్ ఫర్ చేసే పవర్ కూడా ఆమె చేతిలో ఉందన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకదు. వెనుకబడినవర్గానికి చెంది, పిన్న వయసులో మంత్రి అయిన విడదల రజనీది అదే పరిస్థితి ఆమె తాను నిర్వర్తిస్తున్న శాఖకు సంబంధించి నిర్ణయాలు సొంతంగా తీసుకుంటున్నారా అంటే అదీ లేదు. ఏపీలో ఇటువంటి విశ్లేషణ చేయడానికి ఏమంత తెలివితేటలు అవసరం లేదు. ఎందుకంటే కేబినెట్ మొత్తం డమ్మీనే అన్న విషయం అందరికీ తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తదితరులు తప్పిస్తే తమ ఉనికిని చాటుకునే అమాత్యులెవరూ లేరు. 17 మంది మంత్రుల్లో వెనుకబడిన తరగతుల వారికి ప్రాధాన్యమిచ్చామని చెబుతున్న సీఎం.. కీలక శాఖలను మాత్రం తన అస్మదీయులకు, సొంత సామాజికవర్గానికి చెందిన వారికే కట్టబెట్టారు. మిగతా వారికి శాఖలు ఉన్నా ఉత్సవ విగ్రహాలే. ఆపై మీట నొక్కుడుతో వీరెవరికీ పనిలేకుండా పోయింది.

అంతటా అగ్రవర్ణాల పెత్తనమే…
స్థానిక సంస్థల గురించి చెప్పనక్కర్లేదు. 75 శాతం రిజర్వేషన్లు అమలుచేశామన్నవి కేవలం గణాంకాలే. పంచాయతీ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, ఎంపీపీలు, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ పీఠాలపై కూర్చొన్న వెనుకబడిన వర్గాలపై ఎలాగూ పెత్తనం ఉంటుంది. ఎస్సీ సర్పంచ్ ఉన్నదగ్గర అధికార పార్టీ చోటా నాయకుడు, ఎస్టీ ఎంపీపీ ఉన్నచోట అగ్రవర్ణాల వైస్ ఎంపీపీ, మండల ప్రత్యేకాహ్వానితుడు, అంతెందుకు ఎస్సీ, ఎస్టీనియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సమాంతరంగా మరో అగ్రవర్ణ నాయకుడు చలామణిలో ఉంటాడు. స్థానికసంస్థల్లో రిజర్వేషన్లతో పదవులు దక్కించుకొని స్వతంత్రంగా వ్యవహరించే వారు చాలా అరుదు. అటువంటప్పుడు సామాజిక న్యాయంఅనేది కేవలం గణాంకానికే పనికొస్తుందనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. అయితే భారత రాష్ట్రపతి అనే మహోన్నత పదవిని గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ఎంపికతో మాత్రం సామాజిక న్యాయం అనే పదం మరోసారి తెరపైకి వచ్చింది. కానీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రిజర్వేషన్లు పటిష్టంగా అమలుచేస్తే ముర్ములాంటి వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలు మరింత మంది తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

Also Read:PM Modi- Pawan Kalyan: కోరీ మరీ పిలిచిన ప్రధాని మోదీ..తిరస్కరించిన పవన్.. అసలేంటి కథ?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular