ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్న వస్తున్న కొత్తరకం మోసాలు సామాన్య ప్రజలకు షాకిస్తున్నాయి. సైబర్ మోసగాళ్లు కొరియర్లో వచ్చిన క్రెడిట్ కార్డు కవర్ తీయకముందే ఆ కార్డులోని నగదును స్వాహా చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. నగరంలోని బోయినపల్లికి చెందిన సాయితేజేశ్వరరెడ్డి ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అతనిని ఒక షాపింగ్ మాల్ లో రిప్రజెంటేటివ్ కలిసి ఛార్జీలు లేకుండా క్రెడిట్ కార్డ్ ఇస్తానని చెప్పారు.
ఎలాంటి ఛార్జీలు లేవని చెప్పడంతో సాయితేజేశ్వరరెడ్డి క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి ఆసక్తి చూపారు. అయితే సంవత్సరానికి తరువాత 2 వేల రూపాయలు చెల్లించాలనీ ఆర్బీఎల్ ప్రతినిధులు చెప్పగా తనకు కార్డును డిస్పాచ్ చేయవద్దని సాయితేజేశ్వర రెడ్డి కోరారు. అయితే బ్యాంకు ప్రతినిధులు మాత్రం కార్డును అతని ఇంటికి డిస్పాచ్ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన అతనికి కొరియర్ ద్వారా కార్డ్ అందింది.
అయితే కార్డును వినియోగించడం ఇష్టం లేని సాయి ఆ కార్డును సీల్ తీయకుండా అలానే ఉంచారు. ఈ నెల 24వ తేదీన సాయికి ఆర్బీఎల్ ప్రతినిధుల పేరుతో అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ లో అవతలి వ్యక్తులు హిందీలో మాట్లాడారు. ఆ తరువాత సాయితేజేశ్వరరెడ్డి బ్యాంకు ఖాతా నుంచి రూ. 76,820, రూ.21,420, రూ.12,712 కట్ అయినట్లు మొబైల్ ఫోన్ కు మెసేజ్ లు వచ్చాయి.
ఏం జరిగిందో అర్థం సాయి బ్యాంకు ప్రతినిధులను సంప్రదించి కార్డు బ్లాక్ చేయించడంతో పాటు సైబర్ క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు. కవర్ తీయకముందే సైబర్ నేరగాళ్లు కార్డులోని నగదును కొల్లగొట్టడం గమనార్హం