కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులు, పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పెన్షనర్లకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న మూడు డీఏలను ఒకేసారి అందిస్తామని వెల్లడించింది. గతేడాది జులై 1 నుంచి పెండింగ్ లో ఉన్న డియర్నెస్ అలవెన్స్ ఉద్యోగులకు లభించనుంది. రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.
గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కు ఆదాయం తగ్గిన సంగతి తెలిసిందే. ఆదాయం తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంపును, పెన్షనర్లకు డీఆర్ పెంపును నిలిపివేసింది. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కేంద్రానికి ఏకంగా 37 వేల కోట్ల రూపాయలు ఆదా కావడం గమనార్హం. పెండింగ్ లో ఉన్న మూడు డీఏలను ఒకేసారి కేంద్రం అందించడంపై ఉద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 60 లక్షల మంది పెన్షనర్లకు, 50 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 17 శాతంగా లభిస్తుండగా డీఏ పెంపును అమలులోకి తెస్తే ఉద్యోగుల వేతనాలు గతంతో పోలిస్తే పెరుగుతాయి. డీఏ శాతం పెరిగితే ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల పెన్షనర్లకు సైతం ప్రయోజనం చేకూరనుంది.
ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం ఎప్పటినుంచి ఈ నిర్ణయం అమలులోకి తెస్తుందో తెలియాల్సి ఉంది.