Seawater Vs Borewell Water: సముద్రపు ఒడ్డుకు వెళ్లినప్పుడు అందులోని నీరును రుచి చూస్తే ఉప్పుగా ఉంటాయి. ఈ నీళ్లు తాగేందుకు ఏమాత్రం పనికిరాకుండా ఉంటాయి. కానీ సముద్రం పక్కన బోర్ వేస్తే చాలాసార్లు ఉప్పునీళ్లు కాకుండా మంచినీళ్లు కూడా రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఇది సహజసిద్ధమైన భౌగోళిక ప్రక్రియ. భూమి అడుగుభాగంలో నీరు ఎలా నిల్వ అవుతుందో అర్థం చేసుకుంటే ఈ విషయాన్ని సులభంగా గ్రహించవచ్చు. అదెలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం..
సముద్ర తీర ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సముద్రం పక్కనే ఉన్నా, భూమిలోని పైపొరల్లో తేలికైన మంచినీరు ఒక పొరలా నిల్వ ఉంటుంది. దీనిని ‘ఫ్రెష్వాటర్ లెన్స్’ అని అంటారు. ఉప్పునీటి కంటే మంచినీటి సాంద్రత తక్కువగా ఉండటం వల్ల అది పైభాగంలో తేలిపోతుంది. కింద భాగంలో సముద్రపు ఉప్పునీరు ఉండగా, పైభాగంలో ఈ తీయని నీరు ఉంటుంది. అందుకే సరైన లోతులో బోర్ వేస్తే మంచినీళ్లు లభించే అవకాశం ఉంటుంది.
అయితే ప్రతి చోట ఇలా జరగదు. బోర్ వేయడం ఎంత లోతులో జరుగుతుందో, అక్కడి భూగర్భ నిర్మాణం ఎలా ఉందో అన్నది చాలా ముఖ్యం. ఎక్కువ లోతుకు బోర్ వేస్తే ఉప్పునీరు రావచ్చు, ఎందుకంటే కింద ఉన్నది సముద్రపు నీరే. అలాగే అధికంగా భూగర్భజలాన్ని తీసుకుంటే ఈ సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో ఉప్పునీరు పైకి వచ్చి, ముందుగా ఉన్న మంచినీరు కూడా ఉప్పగా మారే అవకాశం ఉంది. ఇది ‘సాల్ట్వాటర్ ఇన్ట్రూజన్’ అనే ప్రక్రియ వల్ల జరుగుతుంది. అంటే సముద్రపు ఉప్పునీరు భూగర్భంలోకి చొరబడటం. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అధికంగా బోర్లు వేయడం, నీటిని ఎక్కువగా పంపింగ్ చేయడం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీని వల్ల తాగునీటి వనరులు క్రమంగా తగ్గిపోతాయి.
సముద్రపు ఒడ్డున ఎంత లోతు వరకు మంచినీరు ఉంటుంది? అన్న సందేహం చాలా మందికి వస్తుంది. సముద్రం పక్కన ఉన్న భూమిలో అంతటా ఒకే మాదిరిగా మంచినీరు లభించే అవకాశం ఉండదు. ఇది అక్కడి భౌగోళిక నిర్మాణం, మట్టి స్వభావం, వర్షపాతం, భూగర్భజల వినియోగం వంటి అంశాలపై ఆధారపడి మారుతుంది. సాధారణంగా తీర ప్రాంతాల్లో పైపొరలో 5 మీటర్ల నుంచి 30 మీటర్ల వరకు మంచినీరు లభించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మంచి నీటి పొర 50 మీటర్ల వరకు ఉండవచ్చు, మరికొన్ని చోట్ల 10 మీటర్లకే ఉప్పునీరు ప్రారంభమవుతుంది.
అధికంగా బోర్లు వేయడం, ఎక్కువగా నీటిని తీసుకోవడం వల్ల ఈ మంచినీటి పొర క్రమంగా కిందకు తగ్గిపోతుంది. దాంతో ఉప్పునీరు పైకి వచ్చి మొత్తం బోర్ నీరు ఉప్పగా మారిపోవచ్చు. కాబట్టి తీర ప్రాంతాల్లో బోర్ వేయాలంటే ముందుగా భూగర్భ జల సర్వే చేయించుకోవడం మంచిది. అప్పుడు ఎంత లోతులో మంచినీరు ఉందో అంచనా వేసుకుని, సురక్షితంగా వినియోగించుకోవచ్చు.